– బూర్గంపహాడ్ ఎంఈఓకు టీయూడబ్ల్యుజే(ఐజేయూ) వినతి
బూర్గంపహాడ్, జూలై 14 : బూర్గంపహాడ్ మండలంలో అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని టీయూడబ్ల్యుజే(ఐజేయూ) కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రత్నం ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి శ్రీహరిబాబు, డొంకన చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో మంగళవారం పలువురు జర్నలిస్టులు ఎంఈఓ యదుసింహరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బర్ల జోషి మాట్లాడుతూ.. జరల్నిస్టుల పిల్లలకు ఫీజు విషయంలో 50 శాతం రాయితీ కల్పించాలని, ఇప్పటికే దీనిపై జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసిందని, మండలంలో అది అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంఈఓను కోరారు.
దీనికి స్పందించిన ఎంఈఓ త్వరలో మండలంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ ఆదేశాల అమలుపై చర్చించి అర్హత కలిగిన జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సంఘ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ సహాయ కార్యదర్శి సాంబరెడ్డి, నియోజకవర్గ ఆర్గనైజింగ్ సభ్యులు నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు శివకుమార్, ఈసీ మెంబర్ రవి, సభ్యులు శ్రీనివాస్, రాంబాబు, కోట రమేష్, జక్కిరెడ్డి మల్లారెడ్డి, చేతుల శ్రీనివాస్, సుధాకర్, ముజాఫర్, కేసుపాక రాజు పాల్గొన్నారు.