రామవరం, సెప్టెంబర్ 11 : రోగులకు అవసరమయ్యే ఔషధాలు ఎల్లప్పుడూ సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, గడువు ముగిసిన మందులను తక్షణమే తొలగించి, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు, గురువారం రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్లో ఔషధాల లభ్యత, నాణ్యత, గడువు తేది, ఆస్పత్రులకు సరఫరా ప్రక్రియలను పరిశీలించారు. తనిఖీ సందర్భంగా సెంట్రల్ మెడికల్ స్టోర్ సిబ్బంది కలెక్టర్ దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. ప్రధాన రహదారి నుండి స్టోర్కు వచ్చే రహదారికి మరమ్మతులు చేయాలని, స్టోర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మందుల నిల్వ ర్యాకులు, బరువైన బాక్సులు ఎత్తడానికి అవసరమైన యంత్రాలను సమకూర్చాలని కోరగా స్పందించిన కలెక్టర్ అవసరమైన అన్ని సదుపాయాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, పెండింగ్ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజారోగ్యం దృష్ట్యా మెడికల్ స్టోర్ల సమర్థవంతమైన నిర్వహణ అత్యంత కీలకమని, అవసరమైన సదుపాయాల కల్పనలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. మందులు కొరత రాకుండా సంబంధిత అధికారులు అవసరమైన ఇండెంట్లు సకాలంలో పంపించాలన్నారు. ప్రతి రోగికి అవసరమైన ఔషధాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని సూచించారు. ప్రతి అధికారికి, సిబ్బందికి ప్రజా ఆరోగ్యం అత్యున్నత ప్రాధాన్యతగా ఉండాలని, వైద్య రంగంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫార్మసీ అధికారి శారద, ఫార్మసిస్ట్ అధికారి రామచందర్, సెంట్రల్ మెడికల్ స్టోర్స్ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.