– ఆంధ్రాకు నీటి తరలింపు కుట్రలను సహించం
– రైతాంగానికి సాగునీరు అందించే వరకు పోరాటం
– బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు
జూలూరుపాడు, జూలై 27 : ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు డిజైన్ చేసిన సీతారామ ఎత్తిపోతల పథకం రూపురేఖలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మార్చివేసేందుకు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. జూలూరుపాడు మండలం అనంతారం గ్రామ పంచాయతీలో పార్టీ సీనియర్ నాయకులు యదల్లపల్లి వీరభద్రం నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రూ.13,000 కోట్ల వ్యయంతో సీతారామ ప్రాజెక్టును తలపెట్టారన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు మూల డిజైన్ను పక్కనబెట్టి, జూలూరుపాడు నుండి ఏన్కూర్ సాగర్ కాల్వకు అనుసంధానం చేస్తూ నీటిని ఆంధ్రా ప్రాంతానికి తరలించేందుకు యత్నిస్తోందని, దీనిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
ఈ మార్పుల వల్ల జూలూరుపాడు, ఏన్కూర్, కారేపల్లి, వైరా, కొణిజర్ల మండలాల పరిధిలోని ఆయకట్టుకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలు నింపుతామని కాలయాపన చేయడం తప్ప ప్రభుత్వం ఇచ్చే హామీలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని విమర్శించారు. ఒక్క జూలూరుపాడు మండలంలోనే సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని, వాతావరణ మార్పులకు తోడు ప్రస్తుతం యూరియా కొరత కూడా తోడవడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయిందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సీతారామ ప్రాజెక్టును పాత డిజైన్ ప్రకారమే పూర్తి చేసి, ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు చాపలమడుగు రామ్మూర్తి, యదలపల్లి వీరభద్రం, తాళ్లూరి రామారావు, పోతురాజు రామారావు, బండారి వెంకయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.