రుద్రంపూర్, మార్చి 7 : దివ్యాంగులకు వారి దినచర్యలో సహాయ ఉపకారణాలు ఎంతో ఉపయోగపడతాయని, లబ్ధిదారులు జాగ్రత్తగా వినియోగించుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా అధ్యక్షతన జరిగింది. జిల్లాలోని దివ్యాంగులు సహాయ ఉపకరణాల కోసం tgobmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగా జిల్లా సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన వారికి తెలంగాణ వికలాంగుల కోపరేటివ్ కార్పొరేషన్ ద్వారా అందచేసిన సహాయ ఉపకరణాలు కొత్తగూడెం నియోజకవర్గ లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెట్రో ఫిట్టెడ్ మోటర్ వెహికల్స్ (స్కూటీ) అర్హులైన లబ్ధిదారులకు సి.ఎస్.ఆర్. ద్వారా సహాయ ఉపకరణాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జాబితా తయారు చేసి సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
ట్రాన్స్ జెండర్ పర్సన్స్ సమాజంలో వివక్షకు గురికాకుండా సొంతంగా ఉపాధి పొందేలా ప్రభుత్వం ఋణాలు మంజూరు చేస్తుందని, ఐదుగురికి సబ్సిడీ రుణాలు మంజూరు చేసి వారు సొంత కాళ్ల మీద నిలబడాలన్నారు. నియోజకవర్గ పరిధిలో దివ్యాంగులకు రెట్రో ఫిట్టర్ మోటార్స్ వెహికల్స్ 25, బ్యాటరీ ట్రై సైకిళ్లు-7, బ్యాటరీ వీల్ చైర్ 7, దివ్యాంగుల ఎకనమిక్ రీహాబిలిటేషన్ సబ్సిడీ 8 మందికి, వివాహ ప్రోత్సాహక బహుమతి 8 మందికి, ట్రాన్స్ జెండర్స్ ఆర్థిక పునరావస పథకం సబ్సిడీ ఐదుగురికి మొత్తం 60 మంది లబ్ధిదారులకు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, కార్పొరేటర్ ఎన్. శ్యామల, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గుండపునేని సతీష్, సిబ్బంది వరప్రసాద్, నాగేశ్వరరావు, నరేశ్, ప్రవీణ్, దివ్యాంగులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు ఎమ్మెల్యే కూనంనేని సహాయ ఉపకరణాలు పంపిణీ