జూలూరుపాడు, ఏప్రిల్ 18 : దళిత క్రైస్తవులపై అమల్లో ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని, లేదా వాటి పరిధి నుండి దళితులను మినహాయించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు పాస్టర్ వేపూరి నతానియల్ రాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండల తాసీల్దార్ శ్రీనివాస్ ను ఆయన కార్యాలయంలో శనివారం కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఉత్తర్వులు దళితులకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు, ఆర్టికల్ 14, 15, 25కు పూర్తిగా విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు తమ ఇష్టానుసారంగా మతాన్ని ఎంచుకునే హక్కు కలిగి ఉండాలని, ఇతర వర్గాలైన ఓసి, బీసీ, ఎస్టీలకు లేని మత పరిమితులు కేవలం ఎస్సీలకే ఎందుకు విధిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. బౌద్ధ, సిక్కు మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగుతుండగా, క్రైస్తవ్యాన్ని స్వీకరించిన దళితులకు దానిని నిరాకరించడం వివక్షకు నిదర్శనమని విమర్శించారు.
1950 రాష్ట్రపతి ఉత్తర్వులు పూర్తిగా అసమానతలను ప్రతిబింబిస్తున్నాయని, చారిత్రాత్మకంగా దళితుల విద్యా, ఆరోగ్య పురోగతిలో క్రైస్తవ మిషనరీలు కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో, మతం మారినందుకు దళితులను శిక్షించేలా ప్రభుత్వ విధానాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఏ మతంలో ఉండాలనేది వ్యక్తిగత నిర్ణయమని, దానిపై ఆంక్షలు విధించే హక్కు ఎవరికీ లేదన్నారు. జ్యోతిరావు పూలే, అంబేద్కర్ స్ఫూర్తితో, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ సెక్రటరీ పాస్టర్ ఫిలిప్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దెబ్బేందుల సాయికుమార్, మాజీ ఫెలోషిప్ అధ్యక్షులు కబీర్ దాస్, పాస్టర్లు శ్రీకాంత్, ఇసాక్, తిమోతి, ఎలీషా, పౌలు పాల్గొన్నారు.