– 34 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
జూలూరుపాడు, మార్చి 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని హోటళ్లు, కిరాణా దుకాణాలపై సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై జిల్లా అధికారి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో మొత్తం 34 అక్రమ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కిరాణా షాపులు, హోటళ్లలో అక్రమంగా దాచిన సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సామాన్యుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఎక్కువ రేట్లకు అమ్ముతున్న వారిపై చర్యలు చేపడతామని హెచ్చరించారు.
గ్యాస్ కొరత లేదని, అవసరానికి మించి నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీఎస్ఓ (ACSO) వరదరాజులు హెచ్చరించారు. ప్రజలకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఎవరూ ఆందోళన చెంది అధిక ధరలకు కొనవద్దు. అక్రమంగా నిల్వ చేసే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై ఆర్ఐ వెంకటేశ్వర్లు, భద్రాచలం డిప్యూటీ తాసీల్దార్ రాజులు, ఇల్లెందు యుడిఆర్ఐ రాంబాబు, జూలూరుపాడు పోలీసులు పాల్గొన్నారు.