బూర్గంపహాడ్, ఏప్రిల్ 28 : బాల్యంలో ఆడపిల్లలకు చేసే వివాహాలు వారి జీవితాలను చిదిమేస్తాయని, తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయస్సులో వివాహాలు చేయడం మానుకోవాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు అంబేద్కర్ అన్నారు. మంగళవారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బాల్య వివాహాల నివారణపై విద్యార్ధినులకు సర్పంచ్ మందా నాగరాజు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకాధికారి రవీంద్రఠాగూర్, ఎంపీడీఓ జమలారెడ్డి, ఐసీడీఎస్ సీడీపీఓ రేవతిలతో కలిసి మాట్లాడుతూ ఆడపిల్లలు యుక్త వయస్సుకు రాకుండానే చిన్నతనంలో బాల్య వివాహాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురుకావడంతో పాటు కుటుంబ పరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతాయన్నారు. ఇప్పటి విద్యార్ధులే బాల్య వివాహాల పట్ల కలిగే అనర్ధాలను, ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులకు వివరించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు చిన్నతనంలో వివాహాలు చేయకుండా నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ యదుసింహరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, డీఆర్డీఏ అధికారి నీలేష్, భజన సతీష్, పంచాయతీ, ఐసీడీఎస్, చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది పాల్గొన్నారు.