మణుగూరు : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఏఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండలంలోని ప్రధాన ఏరియాలతో పాటు ఇతర ప్రధాన రహదారులు కలిసే ప్రాంతాల్లో మొత్తం 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మరికొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అసాంఘీక శక్తులను, అరాచకాలను అరికట్టడంతో పాటు చోరీలను అరికట్టవచ్చన్నారు. అంతేకాకుండా సీసీ కెమెరాలలో నిక్షిప్తమయ్యే డేటాలతో సంఘటనలను పునః పరిశీలించి కేసులను త్వరితగతిన పరిష్కరించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ముత్యం రమేశ్, ఎస్ఐ నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.