దుమ్ముగూడెం : మండల పరిధిలోని మహదేవపురం రైతువేదికలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీడీపీవో నవ్యశ్రీ మాట్లాడుతూ గర్భిణులు, తల్లులు, చిన్నారులు తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోతే రక్తహీనత వస్తుందని, గర్భిణులు బిడ్డ పుట్టిన రెండేండ్ల వరకు బిడ్డకు తల్లి పాలు తాగించాలన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు.
ఈ పోషణ మాసోత్సవాలు ఈనెల 30వ వరకు జరుగుతాయని ఆమె తెలిపారు. తల్లులు పిల్లల పర్యవేక్షణ గురించి అవగాహన కలిగి ఉండాలని, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు సంబంధించి ఎత్తు, బరువు కొలతలు చూడటం జరుగుతుందని, తల్లులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లల ఎదుగుదలకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు ధనలక్ష్మి, సావిత్రి, మణి, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.