సిరిసిల్ల టౌన్, జనవరి 14: రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నది. ఆడబిడ్డల పెండ్లికి అందిస్తున్న సాయంతో ఆనందం వెల్లివిరుస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 125 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ లక్ష నూట పదహార్ల చొప్పున 1.25 కోట్లను విడుదల చేయడంతో హర్షం వ్యక్తమవుతున్నది. శనివారం సిరిసిల్లలోని మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం సంబురంగా సాగింది. ఒక్కరోజు ముందే సంక్రాంతి పండుగ వాతావరణం కనిపించింది. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ చైర్మన్ గడ్డం నర్సయ్య, బల్దియా చైర్పర్సన్ జిందం కళ లబ్ధిదారులకు చీర పెట్టి, చెక్కులను అందజేశారు. దీంతో ఆ మహిళలు మురిసిపోయారు. పండుగ పూట చీర పెట్టి, చెక్కులు ఇవ్వడంతో ఉద్వేగానికి లోనయ్యారు. బిడ్డల పెండ్లికి అండగా నిలిచిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, తహశీల్దార్ విజయ్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు బొల్లి రాంమోహన్, మ్యాన రవి, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
అప్పులు కడుతం
నా భర్త రాములు వడ్డెర కార్మికుడు. మాకు నలుగురు బిడ్డలు. అందులో పెద్ద బిడ్డ సంధ్య పెండ్లి ఈ మధ్యే చేసినం. దినసరి కూలీలుగా పని చేసే మా వద్ద పెండ్లి ఖర్చులకు లేక తెలిసినోల్ల కాడ కొంత అప్పు చేసినం. ఎట్ల కట్టాలని అనుకున్నం. కానీ, కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయల చెక్కు వచ్చింది. ఈ డబ్బులతో అప్పులు కట్టుకుంటం. ఇంత సాయం జేసిన సర్కారును మేం మరిచిపోం.
-గొల్లెం కనకవ్వ, 13వ వార్డు (సిరిసిల్ల)
ఆడబిడ్డలకు మేనమామ కేసీఆర్
సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి కింద లక్ష కట్నం పెట్టి పేదింటి ఆడబిడ్డలకు మేనమామ అయ్యారు. ఆడపిల్లల పెండ్లి చేసేందుకు భయపెడుతున్న నిరుపేద తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి పథకం అండగా నిలుస్తున్నది. ప్రభుత్వం అందిస్తున్న లక్షా నూటపదహార్లలో సంతోషంగా పెళ్లి చేసి బిడ్డను అత్తగారింటికి పంపుతున్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారుల ముఖాల్లో కనిపిస్తున్న సంతోషం వెలకట్టలేనిది.
– జిందం కళ, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్
మునుపెన్నడూ సూడలే..
నా బిడ్డ పెండ్లికి సంబంధించిన పత్రిక, ఆధార్కార్డులతో దరఖాస్తు చేసుకుంటే రూ.లక్షా నుటపదహారు రూపాయల కల్యాణ చెక్కును ఇచ్చారు. ఇటువంటి పథకాలు మునుపెన్నడూ సూడలేదు. ఏ రాష్ట్రంలో గూడా లేవు. అందరికీ ఈ ప్రభుత్వం అండగా ఉంటున్నది. ఎదో ఒక పథకం అందిస్తున్నది. సాయం చేసిన సర్కారు మేలును మరువబోం.
– బచ్చు అనితాశ్రీనివాస్, నెహ్రూనగర్ (సిరిసిల్ల)