సిరిసిల్ల అంటే మెట్ట ప్రాంతం.. పడావుపడ్డ భూములు.. ఇంకిపోయే బోర్లు.. సాగునీటి కోసం తండ్లాడే రైతాంగం.. మరోవైపు వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యలు.. ఇది సమైక్య పాలకులు మిగిల్చిన విషాదం.. అన్నదాత, నేతన్న ఆక్రందనలు చూసిన తెలంగాణ సర్కారు ఈ ప్రాంత ప్రగతిపై ప్రత్యేక దృష్టిసారించింది. సీఎం కేసీఆర్ సహకారం, మంత్రి కేటీఆర్ చొరవతో కాళేశ్వర గంగ మానేరుకు ఎదురెక్కడంతో బీడు భూముల్లో రైతాంగం బంగారు పంటలు పండిస్తున్నది. అలాగే బతుకమ్మ చీరెల ఆర్డర్లతో నేతన్నల జీవితాలకు భరోసా దొరికింది. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన అమాత్యుడి రామన్నవైపే ప్రజానీకం నిలుస్తున్నది. ఎన్నికల వేళ జైకొడుతూ అభిమానం చాటుకుంటున్నది. ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా.. మరోసారి భారీ మెజార్టీ అందిస్తామంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నది.
కరవు, కాటకాలు, దుర్భిక్షంతో అల్లాడిన మెట్ట ప్రాంతం సిరిసిల్ల నేడు సుభిక్షంగా మారింది. మంత్రి రామన్న చొరవతో శ్రీ రాజరాజేశ్వర జలాశయం, అన్నపూర్ణ ప్రాజెక్టు, మల్కపేట రిజర్వాయర్ పూర్తి కాగా, కాళేశ్వరం జలాలతో జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. నాడు రాళ్లు, రప్పలతో సాగుకు నోచుకోని భీడు భూముల్లో నేడు కాళేశ్వరం జలాలతో రైతాంగం బంగారు పంటలు పండిస్తున్నది. పెరిగిన దిగుబడితో రైతుల ఇంట ధాన్యపు సిరులు కురిసింది. ధాన్యం నిల్వ చేసేందుకు గోదాములు ఏర్పాటు చేసింది. గిట్టుబాటు ధరతో అన్నదాతకు ఆదాయం పెంచింది. రైతుబంధు, రైతు బీమా, రైతు వేదికలు ఏర్పాటు చేసి రైతులకు బాసటగా నిలిచింది.
వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో ఉపాధి కరువై మరనేతన్నలు దారాలనే ఉరితాళ్లు చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఏ వార్డులో చూసినా చనిపోయిన నేతన్నల దృశ్యా లు, కుటుంబ సభ్యుల రోధనలు ఇది నాటి సమైఖ్య పాలనలోని పరిస్థితి. స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మైక్రో, శేర్ముల్లా ఫైనాన్స్ ఉచ్చులో కూరుకుపోయిన నేత కార్మికులకు మంత్రి కేటీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేయించారు. 904మంది నేత కార్మికులకు రూ.3.70కోట్లు మాఫీ చేయించారు. రాష్ట్రంలోని తెల్లకార్డు మహిళా లబ్ధిదారులకు బతుకమ్మ కానుకగా చీరెలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి అమలు చేయించారు. ఏటా రూ.350కోట్ల బతుకమ్మ చీరెలు, కేసీఆర్ కిట్లు, క్రిస్మస్, రంజాన్ దుస్తుల తయారీ ఆర్డర్లు సిరిసిల్లకే ఇప్పించారు. చీరెల తయారీతో చేతినిండా పని, పనికి తగ్గ కూలీతో నెలకు రూ.15వేల నుంచి రూ.20వేలు వచ్చేలా కృషి చేశారు. పాత మరమగ్గాలను ఆధునీకరణ, డాబీల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలు అందించారు. నేతన్నకు చేయూ త పథకంలో 5803 మందికి రూ.1.64కోట్లు 10శాతం నూలు వచ్చేలా చేశారు. ఈ పథకంలో ఒక్కో కార్మికుడు రూ.30వేల నుంచి రూ.60వేల వరకు లబ్ధిపొందారు. దేశంలో ఎక్కడాలేని విధంగా నేతన్నకు బీమా పథకం అమలు చేశారు. చనిపోయిన కుటుంబానికి రూ.5లక్షల బీమాతో భరోసా కల్పించారు. పది మంది చనిపోయిన కార్మిక కుటుంబాలకు రూ.50లక్షలు పరిహారం ఎల్ఐసీ నుంచి ఇప్పించి అండగా నిలిచారు.
రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల ప్రజల ఆకాంక్షలను మంత్రి రామన్న నెరవేరుస్తున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు. పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ మెజార్టీ పెంచుకుంటూ తీర్పునిస్తూ వచ్చారు. 2006లో రాజకీయ అరగేంట్రం చేసిన కేటీఆర్ 2009లో సిరిసిల్ల అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా, సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్రెడ్డిపై 171ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి, తిరిగి 2010లో ఉప ఎన్నికల బరిలో నిలిచారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్రెడ్డిపై 68,219 ఓట్లతో, 2014లో జరిగిన ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్రావుపై 53,004 ఓట్లతో, 2018లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్రెడ్డిపై 89వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచిన అభ్యర్థిగా రామన్న రికార్డు సృషించారు.
సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రజలకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. అమత్యుడు రామన్న చొరవతో నియోజకవరగలో జేఎన్టీ యూ, మెడికల్ కళాశాల, వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ఐటీడీఆర్, ఐటీఐ కళాశాల, నర్సింగ్ కళాశాల, గంభీరావుపేట మండల కేంద్రంలో కేజీ టూ పీజీ కళాశాలలు ఏర్పాటు చేశారు.
తమ అభిమాన నాయకుడు, ప్రగతి ప్రదాత అమాత్యుడిపై ప్రజల అభిమానం వెల్లువెత్తుతున్నది. జరుగబోయే ఎన్నికల్లో లక్షకు పైగా మెజార్టీతో కేటీఆర్ను గెలిపించేందుకు కార్యకర్తలు, నాయకులతోపాటు ప్రజలంతా పట్టదలతో ఉన్నారు. ఇప్పటికే రామన్నకు మద్దతుగా పలు కులసంఘాలు మద్దతు ఇచ్చాయి. టెక్స్టైల్స్పార్కు, మాక్స్సంఘాలు ప్రత్యేకంగా తీర్మానం చేశాయి. తంగళ్లపల్లి మండలంలోని వడ్డెర సంఘం అధ్యక్షుడు దుర్గయ్య ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కుటుంబాలు ముందుకు వచ్చి మద్దతు తెలిపాయి. తమ అభిమాన నాయకుడి నామినేషన్ ఫీజుకు సైతం రూ.10,116 పార్టీకి అందించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజలు తమ మద్దతు తెలుపుతున్నారు.