2014, 2018 ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే సీఎం కేసీఆర్, సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చారు. ఉద్యమ సమయం నుంచి నాటి ఎన్నికల వరకు ఇచ్చిన ప్రతి హామీని వంద శాతం అమలు చేయడమే కాదు, మంత్రి కేటీఆర్ కృషితో ప్రగతి ఫలాలను కండ్ల ముందు ఆవిష్కరించారు. నాటి సమైక్య పాలనలో ఆకలిచావులు, ఆత్మహత్యలతో ఉరిసిల్లగా పడిన ముద్రను తొలగించడమే కాదు, కుదేలైన వస్త్ర పరిశ్రమకు జీవం పోశారు. ‘నేతన్నల్లారా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. బంగారు తెలంగాణ చూసేందుకు బతికుండాలి’ అని ఆనాడు విజ్ఞప్తి చేసిన ఆయన, నేడు నేత కార్మికులకు భరోసా కల్పించారు. కరువుతో తండ్లాడిన మెట్టప్రాంతాన్ని కాళేశ్వర జలాలతో అభిషేకించారు. సిరిసిల్లను కొత్తగా జిల్లాగా ఏర్పాటు చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఇప్పుడు మరోసారి ప్రజల ఆశీర్వాదం కోసం వస్తున్నారు. మంగళవారం సిరిసిల్ల గడ్డపై నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొననుండగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేశారు.
నిజానికి సిరిసిల్లలో అన్ని వనరులున్నయి. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పర్మానేరు, మధ్యమానేరు, ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుల నుంచి నీళ్లను వాడుకునే సదుపాయం ఉన్నది. అందుకు సంబంధించిన ప్రణాళికలు నావద్ద ఉన్నయి. కచ్చితంగా చెబుతున్న. ఈ నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుత. అందులో ఎటువంటి సందేహం లేదు. సిరిసిల్లను సిరులకు నిలయంగా మార్చి చూపిస్త. టెక్స్టైల్ ఇండస్ట్రీకి కేరాఫ్గా చేస్త. పనిచేసే సత్తా ఉంది. ఇంకో విషయం నేను స్పష్టంగా చెబుతున్న. జిల్లాల పునర్విభజనలో భాగంగా సిరిసిల్లను సిద్దిపేటలో కలుపుతామనే పుకార్లు వస్తున్నయి. ఇది నిజంకాదు. సిరిసిల్లలో చేనేత, బీడీ కార్మికులున్నరు. చేనేత కార్మికుల్లారా.. బిడ్డల్లారా మీరెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. బంగారు తెలంగాణ చూసేందుకు బతికి ఉండాలని వేడుకుంటున్న.
మీ అప్పుల విషయాన్ని సర్కారే చెల్లించేలా చూస్తం. బీడీ కార్మికుల సంక్షేమం కోసం ఒక్కో కార్మికురాలికి నెలకు వెయ్యి భృతి ఇస్తం.
కరీంనగర్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/రాజన్న సిరిసిల్ల, (నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలకు కేరాఫ్గా ఉన్న సిరిసిల్లను సిరుల సిల్లాగా మార్చుతామంటూ తొమ్మిదేళ్ల కింద ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు నేడు కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఈ గడ్డపై నుంచి ఇచ్చిన ప్రతి హామీని వందశాతం అమలుచేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కితే, అంతకుమించి అభివృద్ధిని పరుగులు పెట్టించి అగ్రభాగంలో నియోజకవర్గాన్ని నిలబెట్టిన ఘనత కేటీఆర్కు దక్కింది. 2014లోనే ముఖ్యమంత్రి చెప్పిన మాటలను ఒక్కసారి లోతుగా పరిశీలిస్తే.. సిరిసిల్ల నియోజకవర్గంపై ఆయనకు ఉన్న ప్రేమతోపాటు దూరదృష్టి ఎంత ఉన్నదో అర్థం అవుతుంది. సమైక్య రాష్ట్రంలో నేతన్నల ఆత్మహత్యలను కండ్లారా చూసి చలించిన కేసీఆర్, సీఎం కాకముందే అంటే 2014 ఎన్నికల సమయంలోనే వారిలో మనోనిబ్బరం నూరిపోశారు. ‘నేతన్నల్లారా.. మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. బంగారు తెలంగాణ చూసేందుకు బతికి ఉండాలి’ అని ఆనాడే కేసీఆర్ పిలుపు నిచ్చారు. మాట ఇచ్చినట్టుగానే నేతన్నలకు అన్ని రకాలుగా అండగా నిలిచారు. లక్ష వరకు రుణమాఫీ చేశారు. నేతన్న బీమాతో.. ఈ వృత్తినే నమ్ముకున్న కుటుంబాలకు ధీమానిచ్చారు. నాటి పాలనలో కుదేలైన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు జీవం పోసి, ఉపాధికి భరోసాకల్పించారు. బతుకమ్మ చీరలు, కేసీఆర్కిట్లు, రంజాన్, క్రిస్మస్ వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లతో చేతినిండా పనికల్పిస్తున్నారు. సిరిసిల్ల బ్రాండును వివిధ దేశాల్లో విక్రయించే స్థాయికి చేర్చారు.
అంతేకాదు, ఈ ప్రాంతంలోని బీడీ కార్మికులకు ఇచ్చిన భృతి హామీని వందకు వంద శాతం అమలు చేశారు. మరో విశేషం ఏమిటంటే.. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతానంటూ ఆనాడే చెప్పడాన్ని చూస్తే.. సీఎం కాక ముందే ఈ ప్రాంతంపై ఎంత పట్టున్నదో తెలుస్తున్నది. కాళేశ్వరం జలాలను ఎలా తరలించి మెట్ట ప్రాంతాలను అభిషేకించవచ్చో ఆనాడే విప్పి చెప్పిన ఆయన, ఆచరణలో చేసి చూపించారు. కరువుతో తండ్లాడిన సిరిసిల్లను కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేశారు. నాడు సమైక్య పాలనలో మధ్యలో వదిలేసిన శ్రీరాజరాజేశ్వర జలాశయాన్ని పూర్తి చేయించారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఎండిపోయిన ఎగువమానేరు జలాశయాన్ని ఎండకాలంలోనూ నిండుకుండలా మార్చారు. ఇటు మానేరు, అటు మూలవాగుపై చెక్డ్యాంలు నిర్మిస్తూ, సజీవనదులుగా మార్చుతున్నారు. ఇప్పుడు నెర్రలుబారిన నేలల్లో కాళేశ్వరం జలాలు సవ్వడి చేస్తున్నాయి. భూగర్భ జలాలు ఏకంగా ఆరు మీటర్లపైకి చేరాయి. మరోవైపు భూములన్నీ పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. అలాగే సిరిసిల్లను ప్రత్యేక జిల్లాగా ఏర్పా టు చేస్తామని చెప్పినట్టుగానే కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మంత్రి కేటీఆర్ కృషి మేరకు అడిగినన్నీ నిధుల ఇస్తూ ప్రగతిని పరుగులు పెట్టించారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఆదర్శంగా నిలిపారు. వ్యవసాయ, ఇంజినీరింగ్, వైద్య, పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేయిం చి ఎడ్యుకేషన్ హబ్లా మార్చారు.
ఉద్యమాల గడ్డ హుస్నాబాద్ వేదికగా ఆదివారం ఎన్నికల శంఖారావం పూరించిన బీర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, సోమవారం జనగామ, భువనగిరిలో ప్రజాశీ ఆశీర్వాద సభలు నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మొదటి బైసాస్ రోడ్డులో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అరకిలోమీటర్ దూరం లో ఉన్నా 25ఎకరాల విశాలమైన స్థలంలో సభా స్థలి సిద్ధం చేశారు. జిల్లా నలుమూలల నుంచి లక్ష మందిని తరలించనుండగా అందుకనుగుణంగా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. సభ ముందు భాగంలో మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేక స్థలం కేటాయించారు. ఎండ తగలకుండా షామియానాలు వేశారు.
వేములవాడలో సమావేశం ముగిసిన అనంత రం మంత్రి కేటీఆర్, రాత్రి పది గంటలకు సిరి సిల్లలోని సభాస్థలికి చేరుకున్నారు. వేదిక, హెలి ప్యాడ్, ప్రజల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీ లించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్ట ణాధ్యక్షుడు జిందం చక్రపాణి, టీఎస్టీపీడీసీ చైర్మ న్ గూడూరి ప్రవీణ్, బొల్లి రాంమోహన్ ఉన్నారు.
సిరిసిల్ల గులాబీమయంగా మారింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కటౌట్లతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జిల్లా కేంద్రానికి వచ్చే శివారులు, ముఖ్య కూడళ్లలో పెద్ద ఎత్తున ప్లెక్సీలు పెట్టారు. దారుల వెంట గులాబీ జెండాలు కట్టారు. మరోవైపు అధినేత కేసీఆర్ ఘనస్వాగతం పలికేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ముఖ్య నాయకులంతా ఏర్పాట్లు చేశారు. ఆశీర్వాద సభకు గత వారం నుంచే అన్ని మండలాల్లో కార్యకర్తలు, సర్పంచులు, ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులంతా సన్నాహక సమావేశాలు పెట్టి జనసమీకరణకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలో 39 వార్డులకు చెందిన కౌన్సిలర్లు ఇంటింటికీ తిరిగి ఆహ్వానిస్తున్నారు.
సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల నుంచి వచ్చే వాహనాలను రెండో బైపాస్ రోడ్డులోని మెడికల్ కాలేజీ ఎదుట ఐదెకరాల స్థలాన్ని కేటాయించారు. సిరిసిల్లలోని అన్నివార్డుల నుంచి వచ్చే ప్రజల కోసం మొదటి బైపాస్ రోడ్డులోని నర్సింగ్ కళాశాల వద్ద ఐదెకరాల స్థలం, జిల్లెల్ల, తంగళ్లపల్లి, ముస్తాబాద్ మండలాల నుంచి వచ్చే వారికి మానేరు బ్రిడ్జి, అపార్ట్మెంట్ పక్కన ఉన్న ఖాళీ స్థలం, ఇతర వాహనాల కోసం రంగినేని ట్రస్టు వద్ద 40 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు.
సిరిసిల్ల ఒకనాడు సిరులకు నిలయంగా ఉండేది. కానీ, సీమాంధ్రుల పాలనలో అది ఆత్మహత్యలు, ఆకలి చావులకు కేరాఫ్గా మారింది. అరవై ఏండ్ల పాలనలో ఏమి జరిగిందో నాకు తెలుసు. నేను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు సిరిసిల్లలో ఒకే రోజు ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం చూసి చలించిపోయిన. అదే సమయంలో పార్టీ నిధి నుంచి 50 లక్షలు ఇచ్చి కొంత మేరకు ఆదుకున్న. దీనికి శాశ్వత పరిష్కారం కల్పించే అవకాశం ఇప్పుడు మనకు వచ్చింది. ఒక్క మాట గట్టగా చెబుతున్న. చేనేత కార్మికుల్లారా.. బిడ్డల్లారా మీరెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. బంగా రు తెలంగాణ చూసేందుకు బతికి ఉండాలని వేడుకుంటున్న. మీకు సంబంధించిన ప్రభుత్వ అప్పులను బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకుంటం. ఈ విషయంలో ఎవరూ బాధ పడొద్దు.
ఉద్యమ సమయంలో కోరుట్ల నుంచి హైదరాబాద్కు రాత్రిపూట సిరిసిల్ల మీదుగా బయలు దేరినం. అప్పుడు ఇక్కడి గోడలపై ఆత్మహత్యలు, చావులు సమస్యకు పరిష్కారం కాదని రాసిన అక్షరాలను చూసి ఏడ్చినం. స్వతంత్య్ర భారతదేశంలో ఇంకా ఈ ఆకలిచావులు ఎందుకని బాధపడ్డం. గత పాలకుల పాలనలో ధ్వంసమైన కులవృత్తులకు సిరిసిల్లనే ఉదాహరణ. నేతవృత్తి చతికిల పడ్డది. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నేత కార్మికుల బతుకులు బాగుచేయాలని తపన పడ్డం. ఇప్పుడు సిరిసిల్లను చూస్తుంటే సంతోషంగా ఉన్నది. ఆత్మహత్యలు ఆగినయి. కానీ, కార్మికుల సమస్యలు ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలె. కార్మికుడు ఆసామిగా ఎదగాలె. అపారల్ పార్క్ ద్వారా మహిళలు శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి పొందాలి. ఒక్కో కార్మికుడికి నెలకు 30 వేల కూలీ రావాలె. ఇంటిల్లిపాది సంతోసంగా ఉండాలన్నదే నా లక్ష్యం. రామారావు ఆధ్వర్యంలో ఆ దిశగా పని జరుగుతున్నది. రామారావు చాలా ఉత్సాహంతో పనిజేస్తుం డు. అమెరికా మార్కెట్లో సిరిసిల్ల బ్రాండ్ ఉండేలా పరిశ్రమ ఎదగాలె.