Inter Exams | ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 25: ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా రావడంతో ఇంటర్ విద్యార్థినిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. తన తండ్రి డ్రాప్ చేస్తాడేమోనని ఎదురుచూసి చూసి, చివరకు ఆర్టీసీ బస్సులో రావడంతో ఎగ్జామినేషన్ సెంటర్కు 17 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. ఈ క్రమంలో అధికారులు పరీక్షకు అనుమతించకపోవడంతో.. సెంటర్ గేటు వద్దనే విద్యార్థిని కన్నీళ్లు పెట్టుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లపల్లికి చెందిన పిట్ల శరణ్య గొల్లపల్లి-బొప్పాపూర్ రాచర్ల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నది. బుధవారం ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కావడంతో తన తండ్రి ఎగ్జామ్ సెంటర్ (ఎల్లారెడ్డిపేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ) దగ్గర దించుతానని చెప్పాడు. అయితే, పని చూసుకుని టైమ్ వరకు వస్తానని వెళ్లిన తండ్రి ఎంత సేపటికీ రాకపోవడంతో.. ఎగ్జామ్కు లేటవుతుందని గాబరాగాబరాగా బస్టాండ్కు వెళ్లింది. అక్కడ ఆర్టీసీ బస్సు ఎక్కి ఎగ్జామినేషన్ సెంటర్కు చేరుకుంది.
కానీ అప్పటికే 9.05 గంటలు దాటిపోవడంతో అధికారులు శరణ్యను ఎగ్జామ్ సెంటర్2లోనికి అనుమతించలేదు. దీనిపై శరణ్య కాలేజీ సిబ్బందిని, ఉన్నతాధికారులను సంప్రదించింది. ఈ క్రమంలో తహశీల్దార్ సుజాత ఎగ్జామ్ సెంటర్కు చేరుకుని, సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో శరణ్య 17 నిమిషాలు ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్ వద్దకు వచ్చినట్లుగా అధికారులు నిర్ధారించారు. దీంతో ఆమెను పరీక్షకు అనుమతించలేదు. తమ భవిష్యత్కు సంబంధించిన పరీక్షలు రాసేటప్పుడు కచ్చితంగా సమయపాలన పాటించాలని తహశీల్దార్ సూచించారు.