సిరిసిల్ల నవ్వుతున్నది. దశాబ్దాల కష్టాలు, కన్నీళ్లు, కరువుకాటకాలను దూరం చేసుకొని సరికొత్తగా కనిపిస్తున్నది. సమైక్య పాలనలో అప్పటి ప్రభుత్వాల ఆదరణలేక, నాయకుల పట్టింపులేక ఎక్కడో విసిరేసినట్టు ఉన్న, నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ చొరవతో ప్రగతి విప్లవాన్ని సృష్టించుకొని సిరిశాలగా మారిపోయింది. నాడు వందలాది మంది కార్మికుల ఆకలిచావులు, ఆత్మహత్యలతో ఆగమైన కార్మిక క్షేత్రం పూర్వవైభవం కార్మిక కుటుంబాల్లో వెలుగు తెచ్చింది. టెక్స్టైల్స్ హబ్.. అప్పారెల్, వీవింగ్ పార్కులతో బతుకుల్లో భరోసా నింపింది. వ్యవసాయపరంగా ఎంతో పురోగతి సాధించింది. వైద్యరంగంలోనూ ముందున్నది. ఇంకా అనేక కళాశాల ఏర్పాటుతో ఎడ్యుకేషన్ హబ్గా ఖ్యాతిగడించింది. ఇలా ఏ రంగం చూసినా అందరి అంచనాలను తారుమారు చేస్తూ తొమ్మిదేండ్లలోనే రూ.18,941కోట్ల అభివృద్ధితో రాష్ట్రంలోనే అత్యుత్తమమైన నియోజకవర్గంగా నిలుస్తున్నది.
సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రజలకు ఉన్నత విద్య, కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేశారు. రూ.165కోట్లతో మెడికల్ కళాశాల, రూ. 402 కోట్లతో జేఎన్టీయూ, వ్యవసాయానికి సాంకేతిక దన్ను ఇచ్చేలా జిల్లెల్లలో రూ.80కోట్లతో వ్యవసాయ కళాశాల, సర్ధాపూర్లో రూ.10 కోట్లతో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, రూ.165 కోట్లతో వ్యవసాయ కళాశాల, రూ.20 కోట్లతో మండెపల్లిలో ఐటీడీఆర్, రూ. 7.75 కోట్లతో ఐటీఐ కళాశాల, రూ.36.45 కోట్లతో నర్సింగ్ కళాశాలతో పాటు 865 పాఠశాలల్లో రూ.20.54 కోట్లతో అదనపు తరగతి గదులు నిర్మించారు. ఇంకా పోటీపరీక్షల అభ్యర్థులకు ఉపయోగపడేలా రూ.4.30కోట్లతో రాష్ట్రంలోనే తొలి గ్రంథాలయం సాంకేతిక హంగులతో ఏర్పాటు చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో పలకతో వచ్చి పట్టాతో విద్యార్థులు ఇంటికి వెళ్లేలా కేజీ టూ పీజీ కళాశాల, రూ.382 కోట్లతో 7 గురుకులాలు, రాష్ట్రంలోనే తొలి ఫైన్ ఆర్ట్స్ గిరిజన గురుకుల కళాశాలు ఏర్పాటయ్యాయి.
దశాబ్ధాలుగా వెనుకబాటులో ఉన్న సిరిసిల్ల స్వరాష్ట్రంలో ప్రగతిలో దూసుకెళ్తున్నది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ అభివృద్ధిలో రాష్ట్రంలోనే అత్యుత్తమమైన నియోజకవర్గంగా నిలుస్తున్నది. బీఆర్ఎస్ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని అక్షర సత్యం చేస్తూ అగ్రపథాన నిలిచింది. స్థానిక శాసన సభ్యుడిగా మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా కేటీఆర్ తనకు రాజకీయ జన్మనిచ్చిన ప్రజల మనస్సును సంపూర్ణంగా గెలిచేట్లు చేసింది. అదే ఊపుతో అయిదో దపా ఎన్నికల రణక్షేత్రంలోకి కదన కుతూహలంతో దూకుతూ విజయ పథంవైపు దూసుకుపోతున్నారు. ఆయన చొరవతో ముఖ్య మంత్రి కేసీఆర్ నిధులు ఇవ్వడం వల్ల నియోజకవర్గం సర్వతో ముఖాభివృద్ధి జరిగింది. 50 ఏండ్లలో జరుగని అభివృద్ధి తన తొమ్మిదేండ్ల పాలనలో రూ. 18,941 కోట్లను తెచ్చి ‘సిరుల’ఖిల్లాగా ఖ్యాతి గడించేలా ముఖ చిత్రాన్నే పూర్తిగా మార్చివేసింది. వ్యవసాయ రంగం, విద్యా, వైద్యంతో పారిశ్రామిక రంగాలతో యువతకు ఉపాధి కల్పించారు. బతుకమ్మ చీరలతో నేతన్నల జీవన ప్రమాణాలు మెరుగు పరిచి బతుకులకు భరోసా కల్పించిన రామన్నకు జనం జేజేలు పలుకుతున్నది.
కార్పొరేట్ స్థాయిలో నియోజకవర్గ ప్రజలకు ఖరీదైన వైద్యం అందించేందుకు 100 పడకల దవాఖాను 300కు పెంచారు. ఏరియా దవాఖానలో ఐసీయూ రూ.2కోట్లు, బ్లడ్ బ్యాంకు రూ.35.83లక్షలు, సీటీస్కాన్ రూ.1.86కోట్లు, ఎన్ఎన్సీయూ రూ.1.26కోట్లు, అల్టాసౌండ్ ఎక్స్రే, మొబైల్ ఎక్స్రే, ఫొటో థెరఫీ రూ.2.64 కోట్లు, ఆక్సిజన్ ప్లాంట్ రూ.1.25 కోట్లు, మాతాశిశు కేంద్రం రూ.12.99 కోట్లు, దవాఖాన విస్తరణ మౌళిక సదుపాయాల కోసం రూ.8.16కోట్లు, డయాగ్నస్టిక్ సెంటర్ రూ.2.50కోట్లు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.3.60కోట్లు, ఫిజియోథెరపీ సెంటర్కు రూ.13లక్షలు వెచ్చించారు. అలాగే 10 అంబులెన్సులు ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మహర్దశ వచ్చింది. రూ.3వేల కోట్లతో బతుకమ్మ చీరలు, కేసీఆర్కిట్లు, రంజాన్, క్రిస్మస్ వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇచ్చి ప్రభుత్వం చేతి నిండా పని కల్పించి, బతుకులకు భరోసా కల్పించింది. నేతన్న చేయూత పథకంలో 5803మందికి రూ.1.64కోట్లు, 10శాతం నూలు రాయితీ రూ.15.12 కోట్లు, నేతన్న బీమా 10 మంది చనిపోయిన కుటుంబాలకు రూ.50లక్షలు పరిహారం చెల్లించారు. నేతన్నకు రుణమాఫీ కింద 904 మంది లబ్ధిదారులకు రూ.3.70కోట్ల ప్రయోజనం కలిగింది. ఇంకా 85 ఎకరాలలో రూ.387.68 కోట్లతో వీవీంగ్ పార్కు ఏర్పాటు చేశారు. రూ.24కోట్లతో టెక్స్టైల్స్ పార్కులో విద్యుత్ సబ్సిడీ, రూ.16కోట్లతో రహదారుల అభివృద్ధి, రూ.174 కోట్లతో అప్పారెల్ పార్కు ఏర్పాటు చేశారు. అప్పారెల్ పార్కులో 10వేల మందికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు జరుగుతున్నవి. గోకుల్దాస్ కంపెనీలో ఇప్పటికే వెయ్యి మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.
సిరిసిల్ల నియోజకవర్గం నాడు సాగునీటికి తండ్లాడింది. ఫలితంగా ఉపాధి కోసం దుబాయి వలస బాట పట్టిన యువతతో బోసిపోయిన పల్లెలే కనిపించేవి. బీడు వారిన నేలల్లో వెక్కిరించే పిచ్చిమొక్కలను చూసి గోదావరి జలాలను తెచ్చి మెట్టను అభిషేకిస్తానన్న హామీని తీర్చారు. రూ. 553కోట్లతో మల్కపేట రిజర్వాయర్ను నిర్మించి మరో లక్ష ఎకరాలకు నీరందించే బృహత్తర కార్యక్రమం చేపట్టారు. కాళేశ్వర జలాలతో మధ్యమానేరు నింపడంతో మండుటెండల్లో మత్తళ్లు దూ కింది. వరద నీటిని ఒడిసిపట్టేలా మానేరు వాగుపై రూ.140 కోట్లతో నిర్మించిన 12 చెక్డ్యాంలు ఎండాకాలంలోనూ నిండుకుండను తలపిస్తున్నాయి. ఎదురెక్కిన గోదావరి జలాలు సిరిసిల్ల మానేరులోని గంగమ్మ కాళ్లు కడుగుతున్నాయి. రైతుబంధు పథకంలో నియోజకవర్గంలోని 56,023 మంది రైతులకు రూ.532. 15కోట్లు పెట్టుబడి సాయం అందించారు. 806 రైతు కుటుంబాలకు రూ. ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున రూ.40కోట్ల 30లక్షలు బ్యాంకుల్లో జమయ్యాయి. 806 మంది రైతులు చనిపోగా, కుటుంబానికి రూ.5లక్షల చొప్పున రూ.40.30కోట్ల ఆర్థిక సాయం అందించారు. రూ.12.54కోట్లతో 57రైతు వేదికలు నిర్మించారు. రూ.11.15 కోట్లతో వ్యవసాయ రైతులకు ఆధునిక యంత్రాలను అందించారు. రూ.20కోట్లతో ఆధునిక వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేశారు.
గొల్లకుర్మలకు గొర్రెల యూనిట్లకు రూ.67.84కోట్లు, మెప్మా రుణాలు రూ.180.33 కోట్లు, మత్స్యశాఖ రూ.6.10కోట్లు (చేపపిల్లల పంపిణీ, కార్మికులకు ఆర్థిక సహాయం) గిరికతాళ్ల ఏర్పాటుకు రూ.38.50కోట్లు అందించారు. దళిత బంధు కింద 100 మందికి రూ.10 కోట్లు ఇచ్చారు. మహిళలకు రుణాలు రూ.917.5కోట్లు, వడ్డీలేని రుణాలు రూ.21.95కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ రూ.4.57కోట్లు, శ్రీనిధి కింద రూ.163.23 కోట్లు, ధాన్యం కొనుగోలుకు సంబంధించిలు రైతులకు రూ. 917కోట్లు చెల్లించారు. ఇంకా ఆక్వాహబ్ రూ.90కోట్లు, నర్మాల పుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రూ.100కోట్లు, కోల్డ్ స్టోరేజీ రూ.7 కోట్లు, మార్కెట్ యార్డులు రూ.4.40 కోట్లు. రైతు బజార్ రూ.5.25కోట్లు, మిషన్ కాకతీయ రూ.49.9కోట్లు, ఇంటింటికీ స్వచ్ఛమైన జలం అందించేందుకు మిషన్ భగీరథ కింద రూ.1258 కోట్లతో పనులు చేశారు. అలాగే రహదారులు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 727.83 కోట్లు వెచ్చించారు. సమీకృత కలెక్టరేట్ భవనాన్ని రూ. 64.70 కోట్లు, పోలీస్ భవనాన్ని రూ.38.50 కోట్ల వ్య యంతో నిర్మించారు. విద్యుత్ సబ్స్టేషన్లు, వివిధ పనులకు రూ.260.05 కోట్లు, అంగన్వాడీ భవనాలు రూ.6.37కోట్లు, డేకేర్ సెంటర్ రూ.40లక్షలు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ రూ.2.30కోట్లు, సఖీసెంటర్ రూ.50 కోట్లు, బాల సదనం రూ.1.30 కోట్లు, అంబేడ్కర్ భవనం ఇలా అన్ని వర్గాల సంక్షేమం కోసం రూ.వేలాది కోట్లు తెచ్చి, ఈ తొమ్మిదేండ్లలోనే మంత్రి కేటీఆర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు.
జంక్షన్ల అభివృద్ధికి రూ.360. 49 కోట్లతో ప్రధాన కూడళ్ల జంక్షన్లు అభివృద్ధి చేపట్టారు. నేతన్న, అంబేద్కర్, కొండా లక్ష్మణ్బాపూజీ, గాంధీ, తెలంగాణ తల్లి చౌరస్తాలు అభివృద్ధి చేశారు. సిద్దిపేట, కరీంనగర్, కామారెడ్డి రహదారుల వెంట డివైడర్లు. రూ.5.46 కోట్లతో సిరిసిల్ల పట్టణంలో పది పార్కులు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. మినీ స్టేడియం రూ.5కోట్లు, కళాశాల మైదానం రూ.2కోట్లు, కొత్త చెరువు ట్యాంక్ బండ్ రూ.13.25కోట్లు, వెజ్,నాన్వెజ్ రైతు మార్కెట్ రూ.5కోట్లు, సైంటిఫిక్ మాడ్రన్ దోభిఘాట్ రూ.1.34కోట్లు, వైకుంఠధామాలు రూ.5.83కోట్లు, పారిశుధ్యం, ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణకు రూ.9.28 కోట్లు, ఓపెన్ జిమ్లు రూ.1.75కోట్లు, సాముహిక మహిళా భవనాలకు రూ.3.82 కోట్లు, ఎంప్లాయిమెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ రూ.1.98కోట్లు, ఎస్టీపీ రూ.61.50కోట్లు వెచ్చించారు.