గోదావరిఖని : సింగరేణి మెడికల్ బోర్డుపై రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు సింగరేణిలో దుమారం రేపుతున్నాయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం బదులిస్తూ గతంలో 5 సంవత్సరాలలో 119 మెడికల్ బోర్డులు నిర్వహించి 13119 మంది కార్మికులను మెడికల్ అన్ఫీట్ చేసి వారి స్థానంలో ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు.
ఈ విషయంలో విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొనడం ఆయన అవివేకాన్ని తెలియజేస్తుందన్నారు. సింగరేణి కార్మికులకు వారి స్థానంలో వారి డిపెండెంట్లు ఉద్యోగం పొందుతే దానిని కాంగ్రెస్ ప్రభుత్వం సహించలేకపోతుందని మెడికల్ బోర్డులలో ఏదో జరిగిందని విచారణ జరుగుతుందని పేర్కొనడం కార్మిక వర్గాన్ని ఇబ్బందుల పాలు చేయడమేనని ఆయన విమర్శించారు.
ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం ఇలాంటి కార్మిక వ్యతిరేక మాటలను మాట్లాడటాన్ని తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. సింగరేణిలో రాని బొగుత్పత్తికి వచ్చినట్లుగా చూపించి దానికి అనేక రకాల టాక్స్ లు చెల్లించిన విషయంలో విచారణ జరపవలసి ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఇప్పటికైనా కార్మికుల ఉసురుపోసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, కార్మికులను ఇబ్బందుల పాలు చేయకుండా చూడాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు నూనె కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.