ధర్మారం, అక్టోబర్ 24: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక సింగిల్ విండో పరిధిలోని మల్లాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
దీనిని రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని సూచించారు. సన్న ధాన్యానికి బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రాలలో తూకం చేసే సమయంలో ఎలాంటి కోత విధించకుండా ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలు విషయంలో అంతా పారదర్శకంగా ఉండాలని ఎలాంటి పైరవీలకు తావు ఉండవద్దని సింగిల్ విండో సీఈఓ కు మంత్రి సూచించారు.
కేంద్రంలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని లేదా తన సెల్ ఫోన్ కు మెసేజ్ పంపిస్తే వెంటనే సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చయ్య, పత్తిపాక సింగిల్ విండో చైర్మన్ నోముల వెంకట్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్ల నాయక్, డైరెక్టర్లు గంధం మహిపాల్, బద్దం గంగారెడ్డి, కోల శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్లు బద్దం రవీందర్ రెడ్డి, కొండ సులోచన, విండో సీఈవో బుచ్చయ్య ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగి రెడ్డి తిరుపతిరెడ్డి, హమాలీలు, రైతులు పాల్గొన్నారు.