Telangana | పెద్దపల్లి జిల్లా మంథనిలో దారుణం చోటుచేసుకుంది. ఓ కసాయి తండ్రి కన్న కూతురినే అతి కిరాతకంగా నరికి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మంథని మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల సదయ్య గురువారం ఉదయం కన్న కూతురు రజిత (10)ని గొడ్డలితో నరికేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. కూతుర్ని నరికిన తర్వాత బయటకు వచ్చిన సదయ్య.. అదే గ్రామానికి చెందిన దూపం శ్రీనివాస్ అనే వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డాడు.
అయితే కొంతకాలంగా సదయ్య మానసిక పరిస్థితి బాగోలేదని స్థానికులు చెబుతున్నారు. ఆరు నెలల క్రితం కట్టుకున్న భార్యనే సదయ్య హత్య చేశాడని ఆరోపించారు. బెయిల్ మీద వచ్చిన సదయ్య.. గ్రామంలోని జనాలపై తరచూ అతను దాడులకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. కాగా, కూతుర్ని గొడ్డలితో నరికి చంపిన సదయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సైకో సదయ్యను తమకు అప్పగించాలని గ్రామస్తులు పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.