కోల్ సిటీ, మార్చి 18: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశాల మేరకు రామగుండం నగర పాలక సంస్థ పరిధి గోదావరిఖని నగరంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శ్రీనాధ్ ఆధ్వర్యంలో అధికారులు బుధవారం మెరుపు దాడులు చేపట్టారు. నగరంలోని ధనలక్ష్మీ క్యాంటీన్, శంకరయ్య హోటల్, సీతానగర్ వద్ద గల హోటల్, అక్షయ టిఫిన్స్ సెంటర్,శ్రీనివాస వైన్స్ క్యాంటీన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తుండటంను గుర్తించి ఐదు సిలిండ్లను సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు సివిల్ అధికారి శ్రీనాథ్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ దాడులు నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామనీ, నిబంధనలు అతిక్రమించి వంట గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుధవారం కేసులు నమోదైన హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేసి అనంతరం జరిమానా విధిస్తామని తెలిపారు. అవసరమైతే క్రిమినల్ కేసులు సైతం నమోదు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.