ఖమ్మం కమాన్బజార్, ఆగస్టు 4: ఆత్మహత్యకు యత్నించిన వేణు రాసి మూడు పేజీల సూసైడ్ నోట్.. లక్షలాది మంది ఉద్యోగార్థుల ఆక్రోశమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. వేణు ఆవేదన అతడి ఒక్కడిది కాదని, రాష్ట్రంలోని నిరుద్యోగుల గుండెకోత అని పేర్కొన్నారు. గ్రూప్స్ నోటిఫికేషన్ వేయకపోవడం, జాబ్ క్యాలెండర్ అమలుచేయకపోవడం వంటి కారణాలతో తీవ్ర మనస్తాపం చెందిన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురం గ్రామానికి చెందిన జీ వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే.
ఖమ్మం దవాఖానలో చికిత్స పొందుతున్న వేణుకుమార్ను మంగళవారం రాకేశ్రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎంతో గొప్పగా చెప్పుకొన్న యూత్ డిక్లరేషన్ నేడు యూజ్లెస్గా మారి.. రాష్ట్రంలోని నిరుద్యోగుల పాలిట మరణ శాసనంగా మారిందని విమర్శించారు. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, జాబ్ క్యాలెండర్ అమలుచేయకపోవడం, తద్వారా పేదరికాన్ని జయించలేకపోవడం వంటి కారణాలతోనే వేణుకుమార్ ఆత్మహత్యకు సిద్ధమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.