జమ్మికుంట, సెప్టెంబర్ 21 : దళిత బంధు పథకంపై ఎలాంటి అపోహలు వద్దని, అర్హులందరికీ వర్తిస్తుందని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. మంగళవారం ఆయన జమ్మికుంటకు వచ్చారు. మున్సిపల్ పరిధిలోని హౌసింగ్బోర్డు కాలనీలో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వేస్తున్న టీకా కేంద్రాన్ని సందర్శించి, వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. తర్వాత ఆబాది జమ్మికుంట ఎస్సీ కాలనీకి వచ్చి, వాడలన్నీ తిరిగారు. అక్కడ దళిత కుటుంబాలను కలిసి, దళిత బంధు సర్వే తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. దళిత బంధు వచ్చిన వారితో ముచ్చటించారు. ‘రేషన్, ఆధార్ కార్డులు వేరో చోట ఉన్నాయి.. ఇక్కడ దళిత బంధు రావడం లేదు.. సార్.. పరిశీలించండి’ అని కొన్ని దళిత కుటుంబాలు చేసిన విజ్ఞప్తులను ఆయన చూశారు.
సమస్యలను పరిష్కరించేందుకే ఇక్కడికి వచ్చానని తెలిపారు. అనంతరం సర్వే అధికారుల పనితీరును చూసి అభినందించారు. దళిత కుటుంబాల్లో కొందరు ఉద్యోగ, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారని, రేషన్, ఆధార్ కార్డులు వేరే చోట ఉన్నారని, సర్వే సందర్భంగా కొందరు అందుబాటులో లేరని విజ్ఞప్తులు వచ్చాయని, అందుకోసమే రీ సర్వే చేయిస్తున్నామని కలెక్టర్ వివరించారు. సరైన ఆధారాలుంటే దళిత బంధు పథకం అందుతుందని పేర్కొన్నారు. అనంతరం ఓటు హక్కు, అప్డేషన్, తదితర అంశాలపై సర్వే చేయిస్తున్నామన్నారు. అధికారులు తప్పిదాలు లేకుండా అప్డేషన్ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, హుజూరాబాద్ ఆర్డీవో రవీందర్రెడ్డి, తహసీల్దార్ రాజారెడ్డి, కౌన్సిలర్లు నరేశ్, సుగుణ, సిబ్బంది, ఈఆర్వో, ఏఈఆర్వో, కాలనీవాసులున్నారు.
ఓటరు జాబితాలు సిద్ధం చేయాలి
హుజూరాబాద్టౌన్/ హుజూరాబాద్ రూరల్, సెప్టెంబర్ 21: హుజూరాబాద్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం సందర్శించారు. ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటరు ఫారాలను పరిశీలించారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా సిద్ధం చేయాలని, ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, సవరణకు సంబంధించిన జాబితాలు, ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆర్డీవో, తహసీల్దార్లను ఆదేశించారు. మరణించిన వారి పేర్లను, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగించాలని సూచించారు. తొలగించే ముందు వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇవ్వాలని చెప్పారు. ఓటరు జాబితాలో నవీకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అంతకుముందు హుజూరాబాద్ మండలం చెల్పూర్, జమ్మికుంట మండలం ఆబాది జమ్మికుంటలో క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సీహెచ్ రవీందర్రెడ్డితో పాటు కార్యాలయ సిబ్బంది ఉన్నారు.