Haryana Government : హర్యానాలో బీజేపీ సర్కారు మెజారిటీ కోల్పోడంతో ఇదే అంశంపై ఇవాళ గవర్నర్ను కలిసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. రాష్ట్రంలో బీజేపీ సర్కారు మెజారిటీ కోల్పోయిందని, కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ బృందం గవర్నర్ను కోరనుంది. ఈ సాయంత్రం కాంగ్రెస్ బృందం గవర్నర్ కలిసే అవకాశం ఉంది. కాగా, ఈ నెల 7న ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో హర్యానాలో బీజేపీ సర్కారు సంక్షోభంలో చిక్కుకుంది.
‘ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతోనే హర్యానా సర్కారు మెజారిటీని కోల్పోయింది. కాబట్టి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉంది. లేదంటే బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంది. గత పదేళ్లలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నో పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసింది. అయితే హర్యానాలో బీజేపీ రోజులకు కాలం చెల్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ అన్నారు.
కాగా, 90 మంది ఎమ్మెల్యేలున్న హర్యానా అసెంబ్లీలో అధికార బీజేపీకి 39 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జన్ నాయక్ జనతాపార్టీకి 10 మంది సభ్యుల బలం ఉంది. ఏడుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు. హర్యానా లోక్హిత్ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్దల్ పార్టీల నుంచి ఒక్కో ఎమ్మెల్యే గెలిచారు. ఏడుగురు ఇండిపెండెంట్ల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల ముగ్గురు ఇండిపెండెంట్లు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ సర్కారు సంక్షోభంలో పడింది.