హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): మంత్రి సీతక ములుగు జిల్లాలోని ప్రకృతి వనరులను దోచుకుంటుంటే, ఆమె కొడుకు సూర్య బెట్టింగ్లతో జిల్లా యువత జేబులు కొల్లగొడుతున్నాడని రెడో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు వై సతీశ్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో ఆదివారం మీడియాతో సతీశ్రెడ్డి మాట్లాడుతూ.. సీతక కొడుకు సూర్య.. ‘ములుగు ప్రీమియర్ లీగ్’ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ పేరుతో బెట్టింగ్కు పాల్పడుతున్నాడని, పోలీసు స్టేడియంలో పోలీసు అధికారులతోనే టోర్నమెంట్ను ప్రారంభించాడని ఆరోపించారు.
ఇదే టోర్నమెంట్ ఇప్పుడు ‘వన్ ఎక్స్ బెట్’ అనే బెట్టింగ్ యాప్లో లైవ్ అవుతున్నట్టు పేర్కొన్నారు. బెట్టింగ్లో మోసపోయిన కొందరు యువకులు తనకు సమాచారం ఇచ్చారని, దీంతో ఈ విషయం బయటకు వచ్చిందని సతీశ్రెడ్డి తెలిపారు. దీని వల్ల అనేక మంది యువకులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారని ఆధారాలతో బయటపెట్టారు.
సీతమ్మ సాగర్ బరాజ్ వద్ద డీసిల్టేషన్ పేరుతో దాదాపు రూ.2,300 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వారని సతీశ్రెడ్డి ఆరోపించారు. ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినప్పటికీ, జిల్లా మంత్రి సీతక, ఇన్చార్జి మంత్రి పొంగులేటి అండదండలతో ఇసుక దందా జరుగుతున్నదని పేర్కొన్నారు.