కరీంనగర్, మే 9(నమస్తే తెలంగాణ)/ కార్పొరేషన్/రాంనగర్/తెలంగాణ చౌక్/విద్యానగర్/కమాన్చౌరస్తా/కరీంనగర్ రూరల్/కలెక్టరేట్/కొత్తపల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. గురువారం కరీంనగర్కు వచ్చిన అధినేతకు గులాబీ దళం ఘనస్వాగతం పలికింది. అధినేతకు బ్రహ్మరథం పట్టడం.. ఇదే సమయంలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేయడం.. అందులోనూ సర్వే రిపోర్టును వివరిస్తూ వినోద్కుమార్ విజయం ఖరారైందని చెప్పడం వంటివి పార్టీ శ్రేణుల్లో కొత్తజోష్ను నింపాయి. దీంతోపాటు.. కాంగ్రెస్, బీజేపీ గురించి వివరించిన తీరు.. ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడిని ఆలోచింపజేసేలా ఉంది. కేసీఆర్ రోడ్షో.. తమకు మరింత బలాన్ని ఇవ్వడమే కాకుండా.. బీఆర్ఎస్ వైపు ప్రజలు ఓటువేసేలా ఉందని నాయకులు చర్చించుకుంటున్నారు.
నగరంలోని ఎన్టీఆర్ చౌక్ నుంచి బైపాస్ మీదుగా రాంనగర్ ప్రాంతానికి సాయంత్రం 7.30 గంటలకు కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ మహిళలు మంగళ హారతులు, చప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. అనంతరం రాంనగర్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ఒగ్గు డోలు కళాకారుల ప్రదర్శన, మహిళల కోలాటాలు, డప్పుల చప్పుళ్ల మధ్య రోడ్షో ముందుకు సాగింది. ఇక్కడ బీఆర్ఎస్ పాటలకు మహిళలు నృత్యాలతో హోరెత్తించారు. రాంనగర్కు కేసీఆర్ చేరుకోగానే యువత పెద్ద ఎత్తున్న నినాదాలతో హోరెత్తించారు. పటాకులు కాల్చారు. యువకులు రోడ్లుకు ఇరువైపులా బీఆర్ఎస్ భారీ జెండాలతో ముందుకు సాగారు. రాంనగర్ నుంచి మంకమ్మతోట వరకు ప్రజలు కేసీఆర్ రాక కోసం బారులు తీరారు.
బండి సంజయ్తో కరీంనగర్లో పైసా పని జరిగిందా? అని కేసీఆర్ అనగానే లేదంటూ ప్రజలు సమాధానం ఇచ్చారు. బండిసంజయ్ గట్టిగా మాట్లాడితే ఆయన మాట్లాడేది ఏ భాషో మనకే అర్థం కాదని, ఇంకా పార్లమెంట్లో ఏం అర్థం అవుతుందని కేసీఆర్ అనగానే ప్రజలల్లో నవ్వులు విరిచాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటికే వినోద్కుమార్ 8 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారని చెప్పగానే ప్రజల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. కాగా, కేసీఆర్ రాక సందర్భంగా నగర వీధులన్నీ గులాబీ మయమయ్యాయి. రోడ్షోలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీ హరిశంకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వొడితల సతీశ్కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు, గెల్లు శ్రీనివాస్, చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్/ కరీంనగర్ రూరల్, మే 9: తిమ్మాపూర్ మండలం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు కేసీఆర్ రోడ్షోకు వాహనాల్లో తరలివెళ్లారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, నాయకులు దుండ్ర రాజయ్య, పాశం అశోక్ రెడ్డి, పొన్నం అనిల్, పలు గ్రామాల నాయకులు ఉన్నారు. కరీంనగర్ మండలంలోని నగునూర్, చామనపల్లి, చెర్లభూత్కూర్, జూబ్లీనగర్, దుర్శేడ్, మొగ్దుంపూర్, ఫకీర్పేట, బహ్దుర్ఖాన్పేట, దుబ్బపల్లి, బొమ్మకల్, గోపాల్పూర్, చేగుర్తి, నల్లగుంటపల్లి, తాహెర్ కొండాపూర్, ఎలభోతారం నుంచి ఆయా గ్రామాల బీఆర్ఎస్ అధ్యక్షులు, మండల నాయకులు, గ్రామస్తులు బస్సులు, ఇతర వాహనాల్లో బయలుదేరారు. ఈ సందర్భంగా ‘జై కేసీఆర్, జైజై బీఆర్ఎస్’ నినాదాలతో హోరెత్తించారు.