Karate Kalyani | సీనియర్ నటి పావలా శ్యామల ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కుమార్తె మాధవి ఒంటరిగా మిగిలారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాధవి పరిస్థితిపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాధవి బాధ్యతను ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (MAA) తీసుకుంటుందని నటుడు రఘుబాబు గతంలో వెల్లడించారు. తాజాగా ‘మా’ ఈసీ సమావేశంలో మాధవి భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు నటి, ‘మా’ జాయింట్ సెక్రెటరీ కరాటే కళ్యాణి వెల్లడించారు.
మంచు విష్ణు అధ్యక్షతన ఇటీవల ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పావలా శ్యామలకు నివాళులు అర్పించిన అనంతరం ఆమె కుమార్తె మాధవి పరిస్థితిపై చర్చించినట్లు కరాటే కళ్యాణి తెలిపారు. మాధవి ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో ఉన్నందున ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందించాలని కమిటీ నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించామని, వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారని తెలిపారు. మాధవికి ఎంత ఖర్చయినా సరే ఏడాది పాటు ఫిజియోథెరపీ చేయించాలని ‘మా’ నిర్ణయించినట్లు కరాటే కళ్యాణి వెల్లడించారు. ఆమె తిరిగి తన కాళ్లపై తాను నడిచే స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ చికిత్స అందించనున్నట్లు తెలిపారు.
ఏడాది పాటు అవసరమైన వైద్య సహాయం, ఫిజియోథెరపీ అందించిన తర్వాత మాధవి ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఆమెను ఉంచేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే మాధవిని జీవితాంతం పోషించే బాధ్యతను ‘మా’ తీసుకోలేదని కరాటే కళ్యాణి స్పష్టం చేశారు. ‘మా’ ప్రధాన బాధ్యత కళాకారుల సంక్షేమాన్ని చూడటమే తప్ప, వారి కుటుంబ సభ్యులందరి జీవితకాల బాధ్యతను తీసుకోవడం కాదని కమిటీ అభిప్రాయపడినట్లు తెలిపారు. గతంలో ఎంతోమంది సీనియర్ నటులు, కళాకారులు మరణించిన సందర్భాలను ప్రస్తావిస్తూ.. వారి పిల్లల బాధ్యతను కూడా ‘మా’ జీవితాంతం తీసుకోలేదని చెప్పారు. అందువల్ల ఈ విషయంలోనూ ఒక పరిమితి ఉండాల్సిందేనని కమిటీ నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే మాధవి ప్రస్తుతం పూర్తిగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నందున, మానవతా దృక్పథంతో ఆమెకు సాధ్యమైనంత వరకు సహాయం చేయాలని నిర్ణయించినట్లు కరాటే కళ్యాణి తెలిపారు.
పావలా శ్యామల మృతి అనంతరం ఆమెకు సంబంధించిన అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలను కూడా ‘మా’ సహకారంతో సక్రమంగా నిర్వహించినట్లు కరాటే కళ్యాణి తెలిపారు. ఈ విషయంలో తనకు పలువురు అభినందనలు తెలిపారని పేర్కొన్నారు.