కరీంనగర్ రూరల్, మే 9: అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కరీంనగర్ మండలంలోని జూబ్లీనగర్, చామనపల్లి, చెర్లభూత్కూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం తడిసిందా, ఇప్పటి వరకు ఎన్ని క్వింటాళ్లు కొనుగోలు చేశారు, ఇంకా ఎన్ని క్వింటాళ్ల ధాన్యం రావాల్సి ఉంది, తదితర వివరాలను కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్రాల్లో వర్షానికి ధాన్యం తడిసిపోకుండా చూడాలని, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.
రైతులకు ఎలాంటి నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు ఆన్లైన్ చేయాలన్నారు. జిల్లాలో 341 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1,16,890 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని, రైతులకు సత్వరమే డబ్బులను చెల్లిస్తున్నామని తెలిపారు. ఇంకా దాదాపు 60-70 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. జూబ్లీనగర్, చామనపల్లి, చెర్లభూత్కూర్ సెంటర్లలోని రైతుల సమస్యలు, వరి ధాన్యం తేమ శాతం పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఎస్వో సురేశ్రెడ్డి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రజినీకాంత్, జిల్లా సహకార అధికారి రామానుజాచార్య, కరీంనగర్ పీఏసీఎస్ కార్యదర్శి రమేశ్, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు మునిరెడ్డి, రాజేశం, మల్లేశం, అంజయ్య పాల్గొన్నారు.