Donald Trump : అమెరికాతో కుదిరిన శాంతి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. శాంతి ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందం రద్దు అంశాన్ని పట్టించుకోబోనని తేల్చిచెప్పారు. ఇరాన్ అణ్వాయుధం తయారు చేయకుండా అడ్డుకోవడమే అమెరికా లక్ష్యం అన్నారు.
ఇరాన్ అణ్వాయుధ దేశం కాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య భీకర యుద్ధం సాగుతోంది. రెండు దేశాలు దాడులకు దిగాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్తావరాలపై ఇరాన్ దాడి చేస్తోంది. అలాగే, తమ దేశంపైకి వచ్చే అమెరికా యుద్ధ విమానాల్ని ఇరాన్ కూల్చివేస్తోంది. తాజాగా ఇద్దరు అమెరికా సైనికుల్ని ఇరాన్ హతమార్చింది. అలాగే, అమెరికాకు చెందిన యూఎస్ ఎంక్యూ-9 డ్రోన్ను పేల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే, ఇది భారీ, మానవరహిత నిఘా, సమాచార డ్రోన్ అని అమెరికా తెలిపింది. ఇరాన్పై కూడా అమెరికా భారీ దాడులతో విరుచుకుపడుతోంది. ఇరాన్లో నిర్మాణంలో ఉన్న అణుప్లాంటుపై అమెరికా దాడి చేసి, ధ్వంసం చేసింది.
మరోవైపు అమెరికా తమపై దాడులు ఆపాలని, లేకుంటే అమెరికాకు భారీ గుణపాఠం చెబుతామని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని హెచ్చరించారు. శాంతి ఒప్పందంపై ట్రంప్ చేసిన సంతకానికి విలువలేదని, చెల్లదని మొజ్తాబా అన్నారు. అమెరికాకు తగిన గుణపాఠం చెప్పేందుకు ఇరాన్ సైన్యం సిద్ధంగా ఉందన్నారు. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించందని, దీన్ని సమర్ధించుకోవడానికి ప్రపంచం ముందు ప్రయత్నిస్తోందని ఇరాన్ ఆరోపించింది.