జోహన్నెస్బర్గ్: నెల్సన్ మండేలా ( Nelson Mandela ) జయంతి సందర్భంగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (TASA) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. టాసా సభ్యులు న్యూ జెరూసలేం ( New Jerusalem ) చిల్డ్రన్స్ హోమ్ సందర్శించి అనాథ ,నిరాశ్రయ చిన్నారులతో ఆప్యాయంగా గడిపారు.
ఈ సందర్భంగా టాసా ప్రతినిధులు చిన్నారులకు అవసరమైన ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు, దుస్తులు , ఇతర ఉపయోగకరమైన వస్తువులను అందజేశారు. టాసా సభ్యుల కుటుంబసభ్యులు, పిల్లలు ఈ స్వచ్ఛంద సేవ కార్యక్రమంలో పాల్గొని అనాథ పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపారు.

ఈ సందర్భంగా టాసా అధ్యక్షుడు మురళి బండారు ( Murali Bandaru ) మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా న్యూ జెరూసలేం చిల్డ్రన్స్ హోమ్కు టాసా తనవంతుగా సహాయ కార్యక్రమాలు చేస్తుందని పేర్కొన్నారు. సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్నారుల జీవితాల్లో ఆనందాన్ని నింపే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన భారత కాన్సులేట్ జనరల్ ఎస్ కొవేతన్ ( S. Koventhan) మాట్లాడుతూ టాసా సంస్థ గొప్పగా సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగిన విషయమని కొనియాడారు. తన తదుపరి పుట్టిన రోజు న్యూ జెరూసలేం చిల్డ్రన్స్ హోమ్ పిల్లలతో గడుపుతానని ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో తెలంగాణ సంస్కృతి పరిరక్షణతో పాటు సేవా కార్యక్రమాలకు నిర్వహించం పట్ల టాసాను పలువురు అభినందించారు.