కరీంనగర్ మరోసారి కదనభేరి మోగించింది. గులాబీ దళపతి కేసీఆర్కు మొదటి నుంచి అండగా నిలిచిన ఉద్యమ గడ్డ మరోసారి కదం తొక్కింది. అశేష జనం తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నీరాజనం పలికింది. రాంనగర్ నుంచి తెలంగాణ చౌక్ వరకు దారి పొడవునా అభిమానులు కురిపించిన పూల వర్షం మధ్య రోడ్షో అట్టహాసంగా సాగింది. మహిళలు మంగళహారతులు పట్టి స్వాగతించగా, అడుగడుగునా ‘జై కేసీఆర్.. కేసీఆర్ జిందాబాద్.. సీఎం కేసీఆర్’ అన్న నినాదాలతో నగరం మార్మోగింది.
కరీంనగర్, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ జిల్లాకేంద్రంలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షో విజయవంతమైంది. రాజీవ్ రహదారి మీదుగా వచ్చిన ఆయన, ఎన్టీఆర్ చౌరస్తా నుంచి బైపాస్రోడ్డు ద్వారా రాత్రి 7.50 గంటలకు కరీంనగర్లోని రాంనగర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డితోపాటు పలువురు నాయకుల ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు అధినేతకు అపూర్వ స్వాగతం పలికారు. రాంనగర్ చౌరస్తాకు చేరుకోగానే.. ‘సీఎం కేసీఆర్’ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరికొంత మంది పూల వర్షం కురిపించారు.
ప్రజల అభిమానాన్ని చూసిన కేసీఆర్.. బస్సులోనుంచే అభివాదం తెలిపారు. అనంతరం.. డప్పులు, సంప్రదాయ నృత్యాల మధ్య రాంనగర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ.. మంకమ్మతోట, టూటౌన్ పోలీస్స్టేషన్, ముకరంపుర మీదుగా తెలంగాణ చౌక్ వద్దకు చేరింది. దాదాపు 40 నిమిషాలపాటు రోడ్షో కొనసాగగా.. దారి పొడవునా రోడ్డుకు ఇరువైపులా జనం నిలబడి ‘కేసీఆర్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. పలు చోట్ల మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. రాత్రి 8.30 గంటలకు తెలంగాణ చౌక్ వద్దకు కేసీఆర్ చేరుకోగానే.. అప్పటికే ఆయన కోసం వేచి చూస్తున్న జనం ఒక్కసారిగా ‘సీఎం కేసీఆర్.. సీఎం కేసీఆర్’ అంటూ చేసిన నినాదాలు మార్మోగాయి. ‘కేసీఆర్ జిందాబాద్’ ‘కారు గుర్తుకే మా ఓటు’ అనే నినాదాలు హోరెత్తాయి. ఈ సమయంలో.. కేసీఆర్ బస్సుపైకి రాగానే.. జనం ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి. బస్సు పైనుంచి కేసీఆర్ విజయ సంకేతం చూపుతూ అభివాదం తెలుపుతున్న సమయంలో.. రెండు మూడు నిమిషాలపాటు.. సభ ‘జై కేసీఆర్.. సీఎం కేసీఆర్’ అన్న నినాదాలతో హోరెత్తింది.
ప్రజల అభిమానం చూసిన కేసీఆర్.. ఒక దశలో.. సభను నిశబ్ధంగా ఉంచడానికి కేసీఆరే ప్రజలను రిక్వెస్టు చేయాల్సి వచ్చింది. అయినా, నినాదాలు ఆగకపోవడంతో.. వీళ్లంతా మనవాళ్లే కదా..? అంటూ నవ్వుతూ మాట్లాడగానే.. నినాదాలు ఆగిపోయాయి. ఆ తర్వాత కేసీఆర్ సుమారు 25 నిమిషాలపాటు ప్రసంగించారు. వినోద్కుమార్ గురించి వివరించినప్పుడు.. ‘జై వినోదన్న’ అంటూ నినాదాలు మిన్నంటాయి. అలాగే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను మరోసారి ‘కరీంనగర్ భీముడు’ అని సంబోధించినప్పుడు కూడా హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. అటు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ‘హుజూరాబాద్ టైగర్’ అంటూ, ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను ‘వకీల్ సాబ్’ అంటూ కేసీఆర్ సంబోధించినప్పుడల్లా జనం నుంచి కేకలు, ఈలలు వినిపించాయి. కరీంనగర్కు స్మార్ట్ సిటీ సాధించింది వినోద్కుమార్ అయితే అభివృద్ధి చేసి చూపించింది గంగుల కమలాకర్ అని అన్నారు. ఈ సందర్భంగా తీగల వంతెన గురించి కేసీఆర్ ప్రస్తావించారు. రోడ్ షో అనంతరం రాత్రి 9.40 గంటలకు తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్కు కేసీఆర్ చేరుకున్నారు.