Hanuman Jayanti | మల్యాల, : జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో జరుగుతున్న హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నేడు చిన్న జయంతి సందర్భంగా ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది దీక్షాపరులు, భక్తులు చేరుకుంటున్నారు. గుట్ట కింది నుంచి పురాతన మెట్ల దారి, ఘాట్ రోడ్డు, నాచుపల్లి గ్రామాల మీ దుగా అంజన్న సన్నిధానానికి వస్తున్నారు. కాగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత భక్తులు మాల విరమణకు పోటెత్తారు.
ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు బుధవారం పలువురు దీక్షాపరులు స్వామి సన్నిధిలో మాల విరమణ చేశారు. అర్చకులు ఉదయం నాలుగు గంటలకు ఆలయాన్ని తెరిచి, దీక్షా విరమణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాత్రి ఆలయ పరిసరాల్లోనే నిద్రించిన భక్తులు మాల విరమణ మండపానికి ఒక్కసారిగా తరలివచ్చారు. ఉదయం నాలుగు గంటల నుంచి ప్రారంభమైన మాల విరమణ ఏడు గంటల వరకు నిరాటంకంగా కొనసాగింది.
స్వామి వారి జయంతి గురువారం రోజున లక్షలాది మంది భక్తులు కొండగట్టుకు చేరుకొని తాము స్వీకరించి అత్యంత కఠిన నియమాలతో ఆచరించిన మండల, అర్ధ్దమండల, ఏకాదశ దీక్షలను స్వామి సన్నిధిలో విరమిస్తున్నారు. ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్, పాలకమండలి చైర్మెన్ తిరుక్కోవెల మారుతీస్వామి, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ, ఆలయ ఏఈ లక్ష్మణ్రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.