తిమ్మాపూర్ రూరల్, జూన్ 22: మండలంలోని నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేశ్ గతేడాది దసరా నాడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఊరిలో ఆడపిల్ల పుడితే రమేశన్న కానుక పేరిట రూ. 5,116 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తల్లిని నామినీగా చేర్చి డిపాజిట్ బాండ్ను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు 10 మంది ఆడబిడ్డలు జన్మించగా, బుధవారం వారి తల్లులకు పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆడబిడ్డలు పుడితే తల్లిదండ్రులు భారంగా భావిస్తుంటారని, ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రోత్సాహంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. పక్కనున్న ఇందిరానగర్ గ్రామస్తుల కోరిక మేరకు అక్కడ కూడా ఆడపిల్ల పుడితే రూ.5,116 అందజేస్తానని ప్రకటించారు. ఇలాంటి కార్యక్రమాలతోనే జాతీయస్థాయిలో చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు వచ్చిందని పేర్కొన్నారు. ఆడపిల్లలను అత్యున్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. రూరల్ సీడీపీవో సబిత మాట్లాడుతూ ఆడపిల్లలను చిన్నచూపు చూడవద్దని తల్లిదండ్రులకు సూచించారు. సొంత ఖర్చులతో రూ. 5వేలు అందజేస్తున్న సర్పంచ్ రమేశ్కు అభినందనలు తెలిపారు. ఐసీడీఎస్ తరఫున తగిన సహకారం అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ బేతి శ్రీనివాస్రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు, వార్డు మెంబర్లు ఉన్నారు.