మాస్కో, మే 7: రష్యా అధ్యక్షునిగా వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అధికార అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్యాలెస్లో సుమారు 2500 మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుతిన్ రష్యా రాజ్యాంగంపై చేయి ఉంచి, పదవీ ప్రమాణం చేశారు. అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
ఇప్పటికే 25 ఏండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న పుతిన్.. జోసఫ్ స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం రష్యాను పరిపాలించిన నేతగా నిలువనున్నారు. అధ్యక్షుడు బోరిస్ ఎల్టిసిన్ తర్వాత పుతిన్ అధ్యక్షుడు లేదా ప్రధానిగా 1999 నుంచి ఈ పదవిలో ఉన్నారు 2030తో పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఆయన తదుపరి ఎన్నికలలో పోటీ చేసేందుకు అర్హుడే. మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఆయనకు పెద్దగా పోటీనిచ్చే విపక్ష నేత లేకపోవడంతో మరోసారి ఘన విజయం సాధించారు.
ప్రపంచ దేశాలలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రష్యాను తీర్చిదిద్దుతానని 2018లో అధికారం చేపట్టినప్పుడు పేర్కొన్న పుతిన్ దానిని నిలుపుకోలేక పోయారు. రెండేండ్ల క్రితం ఉక్రెయిన్తో యుద్ధంతో నిధులు ఎక్కువ మొత్తం యుద్ధంపైనే వెచ్చించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది.
మార్చిలో జరిగిన ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం సాధించారు. అప్పట్లో అతని ప్రధాన ప్రత్యర్థి అయిన అలెక్సీ నావల్నీ ఎన్నికలకు నెలకు ముందు హఠాత్తుగా మరణించారు. మరికొంతమందిని జైలుకు పంపగా, మరికొందరిని బలవంతంగా విదేశాలకు పంపారన్న ఆరోపణలున్నాయి. రష్యా ప్రైవేట్ సైన్యం అధినేత ప్రిగోజిన్.. పుతిన్పై తిరుగుబాటు చేయడం, విమాన ప్రమాదంలో అతను అనుమానాస్పద స్థితిలో మరణించడంతో పుతిన్పై పలు విమర్శలొచ్చాయి.