మల్యాల : కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, ప్రాజెక్ట్ దండగ అన్నవాళ్లకు నేటి ఎత్తిపోతలతో పంటలకు నీళ్లు అందించడమే నిదర్శనమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ గ్రామంలోని ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పంప్ హౌస్లు మోటర్లను నడుపుతూ వరద కాలువను నింపుతున్న క్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీడువారిన భూముల్లో నీళ్లు పారించి పచ్చని పంటలతో తెలంగాణను సస్యశ్యామలంగా మార్చేందుకు కేసీఆర్ కాళేశ్వరాన్ని కట్టించి రైతులకు కరువుతీరా సాగునీటిని అందించారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ‘కూలిపోయింది.. కుంగిపోయింది.. ఒక్క ఎకరం కూడా పారించలేదు’ అని నోటికొచ్చిన అబద్ధాలాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అబద్ధాలను నిజం చేసేందుకు కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి తెలంగాణ రైతులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. నేడు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులే తెలంగాణకు వరమయ్యాయన్నారు.