కోరుట్ల: కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని, ఆ పార్టీ నాయకులు అన్ని రంగులు మార్చుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విమర్శించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ తో కలిసి ఆమె వెల్లుల్ల గ్రామం, ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘ ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధం. తెలంగాణను పుట్టించింది, రైతు బంధు, బీడీ కార్మికులకు పెన్షన్లు, కల్యాణ లక్ష్మిని ప్రారంభించింది సీఎం కేసీఆర్’ అని పేర్కొన్నారు. ‘ఎన్నికలప్పుడే రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వస్తారు. అందుకే ఆయనకు నేను ‘ఎలక్షన్ గాంధీ ’అని పేరు పెట్టాను. ఆయన మొహబ్బత్ కా దుకాణ్ (ప్రేమను పంచుతాం) అని హిందీలో అంటే హిందీ రాని రేటెంత రేవంత్ రెడ్డి రాహుల్ దుకాణ్ అంటున్నారని దుకాణం తెరిచి సీట్లన్ని అమ్ముకున్నారని’ వ్యాఖ్యానించారు.
వచ్చేది సీఎం కేసీఆర్(CM KCR) ప్రభుత్వమేనని ధీమాను వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీతో ఒక్క అణాపైసా లాభం జరిగిందా అని ప్రశ్నించారు. తెలంగాణను ఆంధ్రలో కలిపిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు. 1969లో తెలంగాణ కావాలని అడిగితే 369 మందిని కాంగ్రెస్ కాల్చిచంపిందని, మనల్ని కష్టపెట్టిన వారికి ఓటేస్తే మోసపోతామని అన్నారు.
కేసీఆర్ బీమా పథకాన్ని బీజేపీ నాయకులు అవహేళన చేస్తున్నారని, అటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. మంచి చేస్తున్నవాళ్లను కాదని ఇతరుల వైపు చూడవద్దని కోరారు. సీఎం కేసీఆర్ కంటే గొప్పగా ఆలోచన చేసేవారు, పనిచేసేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు.
రైతులను అవమానించే రేవంత్ రైతుల మేలు గురించి ఆలోచిస్తారా?
‘రైతులను అవమానించే రేవంత్ రెడ్డి రైతుల గురించి ఏం ఆలోచన చేస్తారని అన్నారు. ధరణిని బంగాళా ఖాతంలో వేస్తామని, రైతు బంధు రాదని, ధాన్యం కొనుగోలు డబ్బులూ రావని స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే కరెంట్ రాదని ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని, అలాంటి అపోహలను పటాపంచలు చేసి దేశంలోనే తెలంగాణను కేసీఆర్ అగ్రగామిగా నిలిపారన్నారు. తప్పుడు పార్టీకి ఓటేస్తే కరెంటు రాదని, కాంగ్రెస్ పాలిస్తున్న కర్నాటకలో అదే పరిస్థతి నెలకుందని గుర్తు చేశారు.
పేద ప్రజల పట్ల ఆలోచన, రైతన్నల బాగు కోసం కృషి చేస్తున్న బీఆర్ఎస్(BRS) పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదాన్ని సీఎం కేసీఆర్ పూర్తిగా సాకారం చూస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 73 లక్షల ఎకరాలకు నేరుగా సాగునీరు అందిస్తున్నామని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తయితే మరో 50 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని వివరించారు.