జగిత్యాల : మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు రోజుకో అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Former Koppula Eshwar) ఆరోపించారు. జగిత్యాల బీఆర్ఎస్ (BRS) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమని విమర్శించారు.
మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ లో 20వ పిల్లర్ కుంగడంతో పక్కనే ఉన్న 19, 21, పిల్లర్ల పై భారం పడిందన్నారు. ఈ మూడు పిల్లర్లను డైమండ్ కటింగ్ తో తొలగించి తిరిగి నిర్మిస్తే సరిపోతుందని ఈఎన్సీ ( ENC ) పేర్కొన్నదని సూచించారు. పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలసింది పోయి విచారణ పేరుతో మేడిగడ్డ పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ జాప్యం చేస్తుందని విమర్శించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టులపై విజిలెన్స్ కమిటీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. రైతులు నారు వేసి నీటి కోసం దిక్కులు చూస్తున్నారని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు సంక్షేమం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) , బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ విభిన్న వ్యాఖ్యలు చేస్తుండడం విచారకరమని తెలిపారు. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాపాలన (Prajapalana) లో తీసుకున్న దరఖాస్తులను తీసుకుని మళ్లీ సర్వే చేయడం దేనికని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు బనాయిస్తే సహించబోమని వెల్లడించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల, ఎమ్మెల్యేలు డా.సంజయ్ కుమార్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, జడ్పీ చైర్ పర్సన్ వసంత తదితరులు పాల్గొన్నారు.