ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన ఉద్యమ నిప్పుకణం అతడు.. తెలంగాణ కోసం పోరాటంలో ముండ్ల కంచెలను, బాష్పవాయు గోళాలను, పోలీసు కేసులను ఎదుర్కొన్న యువకిశోరం అతడు.. యూనివర్సిటీ కంచెల్ని దాటి.. 650 కిలోమీటర్లు కాలినకడకన పాదయాత్ర చేసి.. ఊరూరుకు ఉద్యమ చైతన్యాన్ని మోసుకెళ్లిన విద్యార్థి నేత అతడు.. ఎత్తిన జెండా దించని వ్యక్తిత్వం ఆయనది. నమ్మిన సిద్ధాంతానికి, నమ్ముకున్న నాయకత్వానికి కట్టుబడి.. గులాబీ జెండాను గుండెకు హత్తుకున్న గెల్లు శ్రీనివాస్.. టీఆర్ఎస్ వెన్నంటే నడుస్తున్నారు. యువశక్తిని తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించడమే కాకుండా, విద్యార్థి పోరాటాలను తన నాయకత్వంలో పదునెక్కించాడు. ఉస్మానియా విద్యార్థులంటేనే సమైక్యపాలకులు వణికిపోయేవారంటే.. ఆ కార్యాచరణ శక్తికి కారణమైనవారిలో గెల్లు శ్రీనివాస్ ఒకరు.
రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రీనివాస్కు స్వతహాగా నాయకత్వ లక్షణాలు పుష్కలం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన మరింత రాటుదేలాడు. ఆయనపై వందకు పైగా కేసులు ఉన్నాయంటేనే శ్రీనివాస్ ఉద్యమ భాగస్వామ్యాన్ని అంచనా వేయవచ్చు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా అనేకమంది ఉస్మానియా విద్యార్థి వీరులను రాజకీయ యవనికపైకి తీసుకొచ్చారు. ఎందరో సామాన్యులను నాయకులుగా మార్చారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎవరిని తన అభ్యర్థిగా ప్రకటిస్తుందోనని అన్నివర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చాయి. కానీ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేయడంతో ఉద్యమ అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేవు.
గెల్లు శ్రీనివాస్ యాదవ్ ది గ్రామీణ నేపథ్యం. తండ్రి గెల్లు మల్లయ్య మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 1985లో తెలుగుదేశం పార్టీలో చరుకైన పాత్ర పోషించిన మల్లయ్య 2001 నుంచి 2005 వరకు కొండపాక ఎంపీటీసీగా పనిచేశారు. అఖిల భారత యాదవ మహాసభ కన్వీనర్గా, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. పశుసంవర్థక శాఖ పరిధిలోని జిల్లా యాదవ సహకార సంస్థ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కొండపాక సింగిల్ విండో డైరెక్టర్గా, రైతుబంధు సమితి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. 2004 నుంచి నేటివరకు ఆయన టీఆర్ ఎస్లో మండలస్థాయిలో పనిచేస్తుండగా.. తండ్రి చూపిన దారిలోనే గెల్లు శ్రీనివాస్ యాదవ్ రాజకీయ ప్రస్థానమంతా గులాబీ నీడలోనే సాగింది. తల్లి లక్ష్మి సైతం టీఆర్ఎస్ నేతగా, హిమ్మత్ నగర్ గ్రామ సర్పంచ్గా సేవలందించారు.
రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాసయాదవ్.. డిగ్రీ (బీఏ) చదువుతున్నప్పటినుంచే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. హైదరాబాద్ అంబర్పేటలోని పభుత్వ బీసీ హాస్టల్లో ఉంటూ.. 2003-2006 మధ్య టీఆర్ఎస్వీ ఏవీ కాలేజీశాఖకు అధ్యక్షుడిగా ఎన్నికై విద్యార్థుల సమస్యలపై పోరాడారు. విద్యార్థుల ఫీజు పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో శ్రీనివాసయాదవ్ కీలకపాత్ర పోషించారు. ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ ఏవీ కాలేజీల్లో నడిపిన ఉద్యమంలో శ్రీనివాస్ యాదవ్ అరెస్టు కూడా అయ్యారు. చివరకు కాలేజీ యాజమాన్యం ద్వారా ఫీజు రీయంబర్స్మెంట్ సాధించడంలో ఆయన విజయం సాధించారు. 2003- 2006 మధ్య టీఆర్ఎస్వీ హైదరాబాద్ పట్టణ కార్యదర్శిగా గెల్లు శ్రీనివాసయాదవ్ పనిచేశారు. బొమ్మ రామ్మూర్తి, బాబా ఫసీయుద్దీన్ నాయకత్వంలో ఆయన ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2003-2004 విద్యాసంవత్సరంలో బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇందిరాపార్కులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా శ్రీనివాస్ యాదవ్ ధర్నాలు నిర్వహించారు. 2004 డిసెంబర్లో విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ అప్పటి ఆర్థికమంత్రి కొణిజేటి రోశయ్య ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్టు కూడా అయ్యారు. 2006-2007లో హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీలో టీఆర్ఎస్వీ శాఖకు అధ్యక్షుడిగా పనిచేశారు.
ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే కేసీఆర్ ప్రసంగాలకు శ్రీనివాస్యాదవ్ ఆకర్షితుడయ్యారు. ఆనాటి నుంచి ఉద్యమంలో క్రీయాశీలకంగా వ్యవహరించారు. నేటివరకు అదే ఉత్సాహంతో, టీఆర్ఎస్ పార్టీ అంటే నిబద్ధతతో ఆయన పనిచేస్తూ వచ్చారు. 2017 నుంచి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నారు. ఉస్మానియాలోనూ, బయటా విద్యార్థి పోరాటాలకు గెల్లు శ్రీనివాస్ కొత్త అర్థాన్నిచ్చారు. సమైక్యవాదుల పై నిరసనజెండాను ఎగురవేశారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చరుగ్గా పాల్గొన్నారు. ఉద్యమంలో ఆయనపై వందకు పైగా పోలీసు కేసులున్నాయి. అనేక పర్యాయాలు అరెస్ట్ అయ్యారు. తెలంగాణ కోసం రెండుసార్లు జైలుకు వెళ్లి.. 36రోజులు చర్లపల్లి, చంచల్గూడ జైళ్లల్లో గడిపారు.
– సమైక్య దాష్టీకం పై యావత్ తెలంగాణ రగలిపోతున్న వేళ.. 2006 సెప్టెంబర్ 19న సోమాజిగూడ ప్రెస్క్లబ్ వద్ద లగడపాటికి వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు జరిపిన ర్యాలీలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. పోలీసులు అరెస్టు చేసిన విద్యార్థి నేతల్లో ఆయన కూడా ఉన్నారు.
– తెలంగాణ ఇస్తామని వంచించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ 2006లో కేంద్రమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తున్నందుకు మద్దతుగా నారాయణగూడలో విద్యార్థులతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మలను తగులపెట్టారు.
– 2006 సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంటు, కరీంనగర్ లోక్సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో హరీశ్రావు నాయకత్వంలో స్టూడెంట్ ఇన్చార్జ్గా శ్రీనివాస్ యాదవ్ పనిచేశారు.
– 2008లో జడ్చర్ల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో స్టూడెంట్ ఇన్చార్జ్గా మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నాయకత్వంలో పనిచేశారు. అప్పట్లో టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఎర్రోళ్ల శ్రీనివాస్ నాయకత్వంలోనూ విద్యార్థి ఉద్యమాల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ క్రియాశీలకంగా పనిచేశారు.
– 2009లో కేసీఆర్ అరెస్టును నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు
ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినేతలతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాన్ని నడిపారు శ్రీనివాస్ యాదవ్.
– 2010లో ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా బాల్కసుమన్ నాయకత్వంలో నియమితులయ్యారు.
– 2010 జనవరి 18న తెలంగాణ విద్యార్థి మహాపాదయాత్రను పారంభించి ఓయూ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు ఉత్తర తెలంగాణలోని 650 కిలోమీటర్లు కాలినకడక న పర్యటించి విద్యార్థులను ఉద్యమంలో భాగస్వాములను చేయడంలో విజయం సాధించారు.
– 2011 మార్చి 1న కేటీఆర్ నాయకత్వంలో మౌలాలి రైల్వేస్టేషన్లో చేపట్టిన 48 గంటల రైల్రోకో కార్యకమంలో వందలాదిమంది విద్యార్థులతో కలిసి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
– 2011 మార్చి 10న తెలంగాణ జేఏసీ పిలుపును అందుకుని ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వీ అధ్యక్షుడి హోదాలో మిలియన్ మార్చ్లో పాల్గొన్నారు. ట్యాంకుబండ్ వరకు వందలాదిమంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
పేరు : గెల్లు శ్రీనివాస్ యాదవ్
పుట్టిన తేది : 21-08-1983
తండ్రి: గెల్లు మల్లయ్య (మాజీ ఎంపీటీసీ, కొండపాక)
తల్లి : లక్ష్మి (మాజీ సర్పంచ్, హిమ్మత్నగర్)
విద్యార్హతలు: ఎంఏ, ఎల్ఎల్బీ , పరిశోధక విద్యార్థి (రాజనీతిశాస్త్రం)
సామాజిక వర్గం: బీసీ (యాదవ)
నివాసం : హిమ్మత్ నగర్ (గామం), వీణవంక మండలం, కరీంనగర్ జిల్లా
కార్యనిర్వాహక సంస్థ: తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్ఎస్ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు