(CP Satyanarayana) కరీంనగర్ : ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయించే, సరఫరా చేసే వ్యాపారులు, రైస్ మిల్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వీ సత్యనారాయణ హెచ్చరించారు. పీడీఎస్ బియ్యం కేసుల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్తులను వెంటనే బైండోవర్ చేయడంతోపాటు సస్పెక్ట్ షీట్లు తెరువాలని అధికారులను ఆదేశించారు. కమిషనరేట్ పరిధిలో గంజాయి, పీడీఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించడాన్ని పోలీస్ శాఖ సీరియస్గా తీసుకున్నట్లు వెల్లడించారు. సోమవారం కరీంనగర్లోని కమీషనరేట్ ప్రాంగణంలో పీడీఎస్ బియ్యంకు సంబంధించిన పాత నేరస్తులకు పోలీస్ కమీషనర్ వీ సత్యనారాయణ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు.
పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసే రైస్ మిల్లర్లు, హోటల్ యజమానులపై కూడా చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రేషన్ బియ్యానికి రెక్కలు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేషన్ బియ్యం కొనుగోలు చేసే రైస్ మిల్లర్లను గుర్తించామని, కొందరిపై కేసులు కూడా నమోదు చేశామని చెప్పారు. పీడీఎస్ బియ్యం విక్రయం, కొనుగోళ్ళు, అక్రమంగా రవాణా చేయడం చట్టవ్యతిరేకమైన చర్య అని గుర్తుంచుకోవాలన్నారు.
గత సంవత్సర కాలంలో 21 కేసులను నమోదు చేసి రూ.18 లక్షల విలువ గల 2,350 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించినట్లు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. ఇందులో 40 మందిపై కేసులు నమోదయ్యాయని, 2016 నుండి 150 మందిపై కేసులు నమోదైనట్లు చెప్పారు. రేషన్ బియ్యం కొనుగోళ్ళు, అమ్మకాలతోపాటు అక్రమ రవాణా చేసే వారి సమాచారం తెలిసినవారు వెంటనే డయల్ 100 లేదా సంబంధిత పోలీసు అధికారులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎస్ శ్రీనివాస్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, జే విజయ సారథి, వెంకటరెడ్డితో పాటు పలువురు పోలీసులు పాల్గొన్నారు.
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..