సీఎం ఆదేశాలతో సింగరేణి బోర్డు ఆమోదం
గత మార్చి 31నుంచే వర్తింపు
ఇప్పటికే విరమణ పొందిన 39 మంది అధికారులు, 689 మంది కార్మికులు తిరిగి ఆగస్టు ఒకటి నుంచి విధుల్లోకి
పెళ్లయిన, విడాకులు పొందిన కూతుళ్లకూ కారుణ్య నియామకాల్లో అవకాశం
గోదావరిఖని, జూలై 26;అధికారం చేపట్టినప్పటి నుంచి గని కార్మికులపై అమితమైన ప్రేమను చూపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచి మరోసారి అభిమానాన్ని చాటారు. రాష్ట్ర అవతరణ అనంతరం కోల్ఇండియాలో లేనివిధంగా సింగరేణి కార్మికులకు అనేక హక్కులు కల్పించారు. స్పెషల్ ఇక్రిమెంట్ల అమలు, మెడికల్ బోర్డు ద్వారా కారుణ్య నియామకాలు, ఏసీ క్వార్టర్లు, ఇండ్లు నిర్మించుకున్న వారికి రూ.10 లక్షల రుణంపై వడ్డీమాఫీ, లాభాల్లో 28శాతం వాటా ఇలా అనేక ప్రయోజనాలు కల్పించిన ఆయన తాజాగా విరమణ వయస్సు పెంపుతో పాటు కారుణ నియామకాల్లో పళ్లైన, విడాకులు పొందిన బిడ్డలకు అవకాశమిచ్చారు. అలాగే రూ. 8లక్షల్లోపు ఆదాయ పరిమితి గలవారికి 10 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయించడంపై కార్మికలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
రిటైర్మెంట్ వయసు పెంపునకు ఆమోదం..
హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సోమవారం నిర్వహించిన 557వ బోర్డు డైరెక్టర్ల సమావేశం సింగరేణి అధికారులు, కార్మికుల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 61కి పెంచుతూ ఆమోదం తెలిపింది. ఉద్యోగుల మాదిరిగా కార్మికుల రిటైర్మెంట్ వయసును పెంచాలని కొంతకాలంగా కోల్బెల్ట్ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 20న సింగరేణి చైర్మన్, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో విరమణ వయసును పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బోర్డు డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 2021మార్చి 31ని కటాఫ్ తేదీగా నిర్ణయించారు.
43,899 మందికి లబ్ధి..
విరమణ వయసు పెంపుతో 43,899 మంది కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరుతుంది. వీరు మరో ఏడాది సర్వీసులో కొనసాగుతారు. అలాగే మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రిటైర్డ యిన 39 మంది అధికారులు, 689మంది కార్మికులు ఆగస్టు 1నుంచి తిరిగి ఉద్యోగాల్లో చేరనున్నారు. వీరు గతంలో విరమణ పొందిన సమ యం నుంచి మరో ఏడాది విధులు నిర్వర్తించనున్నారు. అయితే మార్చి, ఏప్రిల్, మేలో రిటైర్డయిన వారికి ఇప్పటికే రావాల్సిన డబ్బులు రావడంతో పాటు పెన్షన్కు సంబంధించిన ప్రాసెస్ పూర్తయింది. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఏజ్ పెంపుతో సింగరేణిలో 2022 మార్చి వరకు ఎలాంటి రిటైర్మెంట్లు ఉండవు.
పళ్లున, విడాకులైన కూతుళ్లకూ అవకాశం..
ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో సంస్థలో పనిచేస్తున్న కార్మికుడి కుమార్తె ప్ళైన, విడాకులు పొందిన వారికి కారుణ్య నియామకాల ద్వారా అవకాశం కలుగుతోంది. ప్రస్తుతం కార్మికుడు చనిపోయిన, మెడికల్ అన్ఫిట్ అయిన అతని కుటుంబంలో కొడుకు, అల్లుడు, పెళ్లి కాని కుమార్తెకు ఉద్యోగం ఇస్తున్నారు. పెళ్లయిన బిడ్డలకు అవకాశం ఇవ్వాలని టీబీజీకేఎస్ నాయకుల విజ్ఞప్తి మేరకు సీఎం సానుకూల నిర్ణయం తీసుకున్నారు. అలాగే 8 లక్షలలోపు ఆదాయ పరిమితి గలవారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. అంతర్గతంగా, సింగరేణిలో జరిగే వివిధ రకాల డైరెక్టు రిక్రూట్మెంట్లలో ఈబీసీ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. దీంతో తక్కువ వేతనాలు పొందుతున్న కార్మికులు, ఉద్యోగం కోసం వేచిచూస్తోన్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి మేలు కలుగుతుంది.
సీఎస్ఆర్కు 60 కోట్లు..
సామాజిక బాధ్యత కార్యక్రమాల నిర్వహణ(సీఎస్ఆర్)కు 60 కోట్లు కేటాయించారు. ఈ నిధులను 2021-22 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సమీప గ్రామాల అభివృద్ధికి వెచ్చించనున్నారు. కరోనా కష్టకాలంలోనూ సర్కారు భారీగా నిధులివ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. అలా గే వివిధ గనులకు అవసరమైన యంత్రాలు, కాం ట్రాక్టు పనులు, రామగుండంలో కొత్తగా ప్రారంభిస్తున్న జీడీకే ఓసీపీ-5 ప్రాజెక్టుకు సంబంధించి రెండు కొత్త రోడ్ల నిర్మాణానికి అవసరమయ్యే బడ్జె ట్, శ్రీరాంపూర్ ఏరియా నస్పూర్ కాలనీ వద్ద జా తీయ రహదారి విస్తరణలో నిర్వాసితులైన స్థానికులకు సింగరేణి నిర్వాసిత కాలనీలో 85చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లను కేటాయించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో సంస్థ చైర్మన్ శ్రీధర్, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణ, రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కేంద్ర బొగ్గుశాఖ డైరెక్టర్ స్వామి, సింగరేణి డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, ఎన్.బలరాం, సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
చారిత్రాత్మక నిర్ణయం
యైటింక్లయిన్ కాలనీ, జూలై 26: నూరేండ్ల చరిత్ర కలిగిన సింగరేణిలో కార్మికుల ఉద్యోగ విరమణ వయస్సును 61ఏండ్లకు పెంచడం చారిత్రత్మాక నిర్ణయమని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ వయస్సును 61ఏండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై యైటింక్లయిన్ కాలనీలోని యూనియన్ కార్యాలయం వద్ద సంబురాలు చేసుకున్నారు. ఆయన పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వోద్యోగుల మాదిరిగా సింగరేణి ఉద్యోగులకు విరమణ వయసును పెంచాలని గౌరవాధ్యక్షురాలు కవిత ఆదేశాలతో పారిశ్రామిక ప్రాంత ప్రజలతో కలిసి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసినట్లు గుర్తు చేశారు. దీంతో సంస్థ సీఅండ్ఎండీకి సీఎం ఆదేశాలు ఇచ్చారని, ఆమేరకు బోర్డు మీటింగులో నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. మార్చి ఒకటి నుంచే ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు వర్తించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రతి ఉద్యోగికి 10 నుంచి 15లక్షల వరకు ఆర్థిక లాభం జరుగునున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగి కుటుంబంలో విడాకులు పొందిన లేదా పెళ్లయిన కూతురుకు ఉద్యోగం ఇచ్చే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్త సత్యనారాయణరెడ్డి, బేతి చంద్రయ్య, ధరణి మల్లేశ్వర్రావు, ముస్కుల అనిల్రెడ్డి, సూర్య శ్యాం, రవీందర్, రాజేశం, ఇటికాల బాలయ్య తదితరులు పాల్గొన్నారు.