శ్రీనగర్ : అమర్నాథ్ యాత్ర నిర్వహణపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. అయితే, ప్రజల ప్రాణాలను కాపాడడమే తమ ప్రథమ ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. సముద్రమట్టానికి 3,880 మీటర్ల ఎత్తున, హిమాలయాల్లో ఉన్న మంచులింగాన్ని దర్శించుకునేందుకు ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 28న పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో ప్రారంభమై.. ఆగస్టు 22తో ముగియనుంది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది యాత్రను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో యాత్రపై సందిగ్ధం నెలకొంది.
ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్ ఎల్జీ స్పందిస్తూ.. ‘కరోనా మహమ్మారిని పరిగణలోకి తీసుకొని త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.. బహుశా రేపటికే (శనివారం) నిర్ణయం రావొచ్చు’ అన్నారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ‘అమర్నాథ్ యాత్ర ఈ సంవత్సరం జరుగుతుందా’ అని అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అంతకు ముందు ఆయన జమ్మూకాశ్మీర్లో అభివృద్ధి, భద్రతా పరిస్థితులపై కేంద్ర మంత్రి అమిత్షా ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు.
సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా, కేంద్ర ప్రభుత్వ ఉన్నత భద్రతా, ఇంటెలిజెన్స్ అధికారులు, జమ్మూ పరిపాలన హాజరైంది. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్లో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితులు, భద్రతా చర్యలు.. పాక్ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంట పరిస్థితులపై ఉన్నతాధికారులకు కేంద్రమంత్రికి వివరించారు.