న్యూఢిల్లీ : దేశంలో కరోనాకు వ్యతిరేకంగా టీకాల పంపిణీ మరింత వేగవంతం కానున్నది. ప్రస్తుతం ఉన్న టీకాలకు తోడు మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నది. వచ్చే వారంలో జైకోవ్-డీ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోసం డీసీజీఐకి దరఖాస్తు చేయనున్నట్లు అహ్మదాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా తెలిపింది. ఈ వ్యాక్సిన్కు ఆమోదం లభిస్తే కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అనుమతి పొందిన డీఎన్ఏ టీకాగా నిలువనుంది. అలాగే దేశంలో అందుబాటులోకి వస్తే నాలుగో టీకా కానుంది. ‘మూడో దశ ట్రయల్స్ డేటా విశ్లేషణ దాదాపు సిద్ధంగా ఉంది. వచ్చే వారం కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం అత్యవసర వినియోగ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ ప్రభుత్వానికి తెలియజేసింది’ అని అధికార వర్గాలు తెలిపాయి.
కంపెనీ వయోజనులతో పాటు 12-18 ఏళ్లలోపు పిల్లలపై సైతం టీకా ట్రయల్స్ నిర్వహిస్తోంది. జైడస్ క్యాడిలా డీఎన్ఏ- ప్లాస్మి్డ్ ఆధారిత జైకోవ్-డీ మూడో డోసుల టీకా. వ్యాక్సిన్ను రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయొచ్చని, కోల్డ్ చైన్లు అవసరం లేదని, దేశంలోని మారుమూల ప్రాంతాలకు రవాణాను మరింత సులభతరం చేస్తుందని కంపెనీ పేర్కొంది. జైడస్ క్యాడిలాకు బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ పరిధిలోని పీఎస్యూ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిరాక్) ఆధ్వర్యంలో నేషనల్ బయోఫార్మా మిషన్ (ఎన్బీఎం) సహకారం అందించింది. మరోవైపు అనుమతి లభిస్తే ఆగస్టు-సెప్టెంబర్ మధ్య ఐదు కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని అందుబాటులోకి తెస్తామని జైడస్ క్యాడిలా తెలిపింది.