సౌతాంప్టన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు వర్షం అడ్డంకిగా మారింది. ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనుండగా, ఇవాళ ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో కనీసం టాస్ కూడా పడకుండానే తొలి రోజు ఆట ముగిసింది. టీ విరామం అనంతరం మ్యాచ్ రిఫరీ తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. మధ్యాహ్నం సమయంలో వర్షం కాస్త తగ్గినట్లు కనిపించినా, ఆ తర్వాత మళ్లీ జల్లులు రావడంతో ఆట జరిగే అవకాశం లేకుండా పోయింది.
రెండో రోజు, శనివారం ఆటను మధ్యాహ్నం 2:30(భారత కాలమానం ప్రకారం) గంటలకే ప్రారంభించనున్నారు. రేపటి ఆటలో 98 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉండటంతో అర్ధగంట ముందుగా మ్యాచ్ ఆరంభంకానుంది. మ్యాచ్లో ఇంకా టాస్ వేయలేదు కాబట్టి, టీమ్ఇండియా తమ తుది జట్టులో మార్పులు చేసుకునే ఆవకాశం కూడా ఉంది.
‘దురదృష్టవశాత్తు, వర్షం కారణంగా మొదటి రోజు ఆట పూర్తిగా రద్దైంది. రేపు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30గంటలకు ఆట ప్రారంభమవుతుందని’ బీసీసీఐ ట్వీట్ చేసింది. ఆటగాళ్లు మైదానంలోకి రాకుండానే మ్యాచ్ రద్దవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్మీడియా వేదికగా నెటిజన్లు ఐసీసీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై మీమ్స్, సెటైర్లు వేశారు.