నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి
ప్రజలకు సత్వర సేవలు అందించాలి
సీడీఎంఏ సత్యనారాయణ
కార్పొరేషన్, జూలై 15: నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని, హరితహారంలో మొక్కలు నాటి పచ్చదనం పరిఢవిల్లేలా చూడాలని మున్సిపల్ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ) సత్యనారాయణ సూచించారు. గురువారం నగరంలో పర్యటించిన సీడీఎంఏ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ ప్రగతి నిధులతో నగరాలు, పట్టణాలను అభివృద్ధి చేయాలన్నారు. హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. నాటిన మొక్కల్లో 85 శాతం బతికేలా సంరక్షించాలని, లేదంటే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణాలు, నగరాల్లో రోడ్ల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. పెద్ద రోడ్లకు ఇరువైపులా మల్టీలేయర్ ప్లాంటేషన్ చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 17 తర్వాత సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉందని, ఆ సమయంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తారని, కమిషనర్లు, చైర్మన్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు అన్ని మున్సిపాలిటీలకు రూ. 2200 కోట్లు ప్రభుత్వం పట్టణ ప్రగతి కింద నిధులు విడుదల చేసిందని వెల్లడించారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో వైకుంఠరథం వాహనాలు ఉండాలని, లేని ప్రాంతాల్లో వెంటనే కొనుగోలు చేయాలని చెప్పారు. నగరపాలక సంస్థ పరిధిలో నాలుగు వాహనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజల సౌకర్యం కోసం వెజ్, నాన్వెజ్ సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో కరెంటు చార్జీలు ప్రతి నెలా చెల్లించాలని ఆదేశించారు. మున్సిపల్ కార్మికులకు కూడా ప్రతి నెలా సకాలంలో జీతాలను అందించాలన్నారు. మున్సిపాలిటీల్లోని దళితబస్తీలను అభివృద్ధి చేయాలని చెప్పారు. మున్సిపాలిటీల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయడంతోపాటు సిటిజన్ చార్టులను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ చట్టాలు, సంస్కరణలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని, ఏమైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
భవన నిర్మాణ అనుమతులు, కొత్త అసెస్మెంట్లు, మ్యుటేషన్ల విషయంలోనూ అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని తెలిపారు. నగర మేయర్ వై సునీల్రావు మాట్లాడుతూ, ముఖ్యంగా మ్యుటేషన్, సెల్ఫ్ అసెస్మెంట్ల విధానంలో ఇబ్బందులు వస్తున్నాయని, వీటిపై మున్సిపాలిటీల పర్యవేక్షణ ఉండేలా చూడాలని సూచించారు. అలాగే భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని, వాటిని కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థలో శనివారం నిర్వహించనున్న సైకిల్ ర్యాలీ పోస్టర్ను సీడీఎంఏ ఆవిష్కరించారు. సమావేశంలో కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, కమిషనర్ క్రాంతి, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపల్ అధ్యక్షులు రాధిక, నీరజ, రుద్రరాజు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.