సంగారెడ్డి, మే 8(నమస్తే తెలంగాణ) : రేవంత్రెడ్డి సర్కార్ వల్లే పటాన్చెరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని, పరిశ్రమలు తరలిపోతున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బుధవారం రాత్రి పటాన్చెరులో కేసీఆర్ రోడ్షో చేపట్టారు. బుధవారం రాత్రి పటాన్చెరు అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగిన రోడ్షోలో కేసీఆర్ ప్రసంగిస్తూ రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు. రేవంత్ ప్రభుత్వం కారణంగా పటాన్చెరులో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని, భూముల ధరలు తగ్గాయన్నారు. పటాన్చెరు, కొల్లూరు ప్రాంతంలో అపార్టుమెంట్ల నిర్మాణం కోసం రేవంత్రెడ్డి అనుమతులు ఇవ్వకుండా రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని ఆరోపించారు. పర్మిషన్ల కోసం రేవంత్రెడ్డి స్కేర్ ఫీట్కు రూ.75 డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. కరెంటు కోతలతో పరిశ్రమలు తరలిపోతున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ఐపాస్ వల్ల పటాన్చెరు ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటైనట్లు తెలిపారు. నిరంతరం కరెంటు సరఫరా చేయడంతో పారిశ్రామికవేత్తలు సంగారెడ్డి జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కరెంటు కోతల కారణంగా పరిశ్రమలు తరలివెళ్తున్నట్లు చెప్పారు. పటాన్చెరులోని ప్రముఖ కళ్ల అద్దాల తయారీ పరిశ్రమ సైతం కరెంటు కోతల కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. పటాన్చెరులో గతంలో కలుషిత జలాలు ఉండేవన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధి తాగునీరు సరఫరా చేశామన్నారు. ఇప్పుడు పటాన్చెరులో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఇండియాలో ఎక్కడి లేనివిధంగా పేదల కోసం తాము కొల్లూరులో 16500 ఇండ్లు నిర్మించి పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం పట్టించుకోవడం లేదన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.
ప్రజల కష్టాలు తీరాలన్నా, పటాన్చెరు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమలు తరలివెళ్లవద్దన్నా ఎంపీ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని ఓటర్లను కేసీఆర్ కోరారు. పటాన్చెరు ప్రాంతంలో పోలీసులు అతిగా ప్రవరిస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని, పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మేము లాఠీలు, జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేది కాదన్నారు. పోలీసులు అతికి పోవద్దని, రాజకీయాలు చేయవద్దని, డ్యూటీలు జాగ్రత్తగా చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రిటైర్డు ఐఏఎస్ అధికారి అని, ఈ ప్రాంతానికి మేలు చేయాలని కోరుకుంటున్నాడని తెలిపారు. రూ.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు విద్యను అందజేయాలని ఆలోచిస్తున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తిని ఎంపీగా గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, కర్నె ప్రభాకర్, గూడెం మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.