ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 22 : రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజలు నవ్వుతూ బతకడమే బంగారు తెలంగాణ అని, దాని కోసమే సీఎం కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా ఎల్లారెడ్డి పెద్ద చెరువులో బుధవారం జహీరాబాద్ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్తో కలిసి లక్షా 52వేల చేపపిల్లలను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో స్పీకర్ ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్య శాఖకు రూ. పది కోట్లు ప్రకటించి, అందులో ఐదు కోట్లు మాత్రమే కేటాయించేవారని తెలిపారు. చివరగా మూడు కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని 20 చెరువుల్లో చేపపిల్లల విడుదల కోసం కేవలం రూ. 12,500 ఇచ్చేవారని గుర్తుచేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి మత్స్యకారుడూ లక్షాధికారి కావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఏటా రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తున్నారని తెలిపారు. వాటితో 5లక్షల 62వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న చెరువుల్లో వంద కోట్ల చేప పిల్లలను ఉచితంగా వేస్తున్నామని చెప్పారు. మత్స్యకారులు చేపలు అమ్మేందుకు 75 వేల మోటర్ సైకిళ్లు, వందలాది మందికి ఆటోలు పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, పార్టీలకు అతీతంగా 300 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. నాయకులు ప్రజాసేవ చేయాడానికి పోటీపడాలని, రాజకీయాలు హుందాగా ఉండాలని అన్నారు. ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. పక్కనే ఉన్న మహారాష్ట్రలో కాంగ్రెస్, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణలో ఉన్నటువంటి పథకాలు అమలుచేయడంలేదని అన్నారు. ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ.. ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయడంతో మత్స్యకారులకు మేలు చేకూరుతున్నదని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ పాటిల్, మత్స్యశాఖ ఏడీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్పీ శశాంక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం, ఏఎంసీ చైర్మన్లు రాధా విఠల్, సత్యం, మత్స్య సహకార సఘం నాయకుడు సాయిలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.