కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో పిల్లలందరూ బడిబాట పడుతున్నారు. విద్యార్థుల హాజరుశాతం రోజురోజుకూ పెరుగుతుండడంతో విద్యాసంస్థల్లో సందడి వాతావరణం నెలకొన్నది. మరోవైపు మెరుగైన బోధన, వసతులు, సౌకర్యాలు కల్పిస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైన 18 రోజుల్లోనే కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 18వేలకు పైగా విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు.
కామారెడ్డి, సెప్టెంబర్ 18: కరోనా తగ్గుముఖం పడుతుండడంతో పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెరుగుతూ వస్తున్నది. అయితే ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలకే ఎక్కువగా విద్యార్థులు వస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇరుకిరుకు గదులతోపాటు విశాలమైన మైదానాలు లేనీ ప్రైవేటు పాఠశాలలు చాలా ఉన్నాయి. దీంతో తమ పిల్లలను ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలలోనే చదివించడం మంచిదనే నిర్ణయానికి తల్లిదండ్రులు వస్తున్నారు. నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతుండడంతో విద్యార్థుల సందడితో కళకళలాడుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నది. ప్రభుత్వ హాస్టళ్లు మినహా నర్సరీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల్లో సందడి కనబడుతున్నది.
జిల్లాలోని విద్యాసంస్థలు..
కామారెడ్డి జిల్లాలో 1,043 ప్రభుత్వ పాఠశాలలు, 1193 అంగన్వాడీ కేంద్రాలు, 18 డిగ్రీ కళాశాలలు, 76 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటితోపాటు 31 ఎస్సీ, 26 బీసీ హాస్టళ్లు, ఏడు బీసీ గురుకులాలు, 13 ఎస్సీ గురుకులాలు, ఏడు ఎస్టీ గురుకులాలు, తొమ్మిది మైనారిటీ గురుకులాలు, ఐదు ఐటీఐలు, మూడు బీఈడీ కళాశాలలు, మూడు డైట్ కళాశాలలు ఉండగా వీటిలో హాస్టళ్లు ప్రారంభించలేదు. జిల్లాలో 175 ప్రైవేటు పాఠశాలలు ప్రారంభమైనా విద్యార్థుల సంఖ్య అంతంతా మాత్రంగానే ఉన్నది. 1017 ప్రభుత్వ పాఠశాలల్లో 84,152 మంది విద్యార్థులు చేరగా, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో 42,229 మంది అడ్మిషన్ తీసుకున్నారు.
హాజరు శాతం పెరిగిందిలా..
మొదటి రోజు సెప్టెంబర్ 1న ప్రభుత్వ పాఠశాలలకు 25,720 మంది విద్యార్థులు హాజరుకాగా 30.56శాతం నమోదైంది. 175 ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో 44,613 మంది విద్యార్థులకు గా ను 5,536 మంది మాత్రమే హాజరయ్యారు. 2 న ప్రభుత్వ పాఠశాలల్లో 44,375 మంది, ప్రైవే టు, ఎయిడెడ్ పాఠశాలల్లో 9,939 మంది హాజరయ్యారు. 4న ప్రభుత్వ పాఠశాలల్లో 45,016, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో 9,672 మంది హాజరుకాగా, ప్రభుత్వ పాఠశాలల్లో 52.74శాతం, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో 22.90 శాతముగా నమోదైంది. 6న ప్రభుత్వ పాఠశాలల్లో 37,654, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో 9,850 మంది హాజరయ్యారు. పండుగ, సెలవు దినాలు మినహా వారం రోజుల తర్వాత పాఠశాలల్లో గణనీయంగా హాజరుశాతం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల కన్నా ప్రైవేటులో విద్యార్థుల హాజరుశాతం తక్కువైంది. ఈ నెల 15న ప్రభుత్వ పాఠశాలల్లో 49,313, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో 13,389 మంది హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో 55.64 శా తం, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో 32.03శాతం హాజరయ్యారు. 16న ప్రభుత్వ పాఠశాలలకు 50, 327, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో 13,605 మంది హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఈ నెల 16న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 88, 993 ఉండగా 50,327 మంది హాజరయ్యారు. దీంతో 56.55 హాజరు శాతం నమోదైంది. 17న ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 89,329కి చేరగా 50,329 మంది తరగతులు విన్నారు. హాజరు శాతం 56.34గా నమోదైంది.
ప్రభుత్వ బడుల్లో 18వేలకు పైగా కొత్త అడ్మిషన్లు
ఈ ఏడాది కరోనా కారణంగా స్కూళ్లు ఆలస్యంగా ప్రారంభమైనా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు ఎక్కువ సంఖ్యలో పెరిగారు. ప్రైవేటు పాఠశాలల నుంచే 2,384 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎయిడెడ్ పాఠశాలలో 18వేల వరకు పైగా కొత్త అడ్మిషన్లు జరిగాయి. ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గుతున్నా ఈసారి మాత్రం పెరిగాయి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 43వేలకు పైగా మంది విద్యార్థులు చదువుతున్నారు. కరోనా కారణంగా ప్రైవేటు పాఠశాలల వైపు తగ్గుముఖం పట్టగా, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగింది.
త్వరలోనే గురుకులాలు,హాస్టళ్ల నిర్వహణపై నిర్ణయం
ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు కావస్తుండగా గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణలో మాత్రం స్పష్టత కనబడడం లేదు. కోర్టు ఆదేశాల మేరకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే కోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, కేజీబీవీ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో తరగతుల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశమున్నది.