కామారెడ్డి టౌన్, జూన్ 11: జిల్లా పరిధిలోని నేషనల్ హైవేలకు ఇరువైపులా ఐదు వరుసల్లో మొక్కలను నాటాలని కలెక్టర్ శరత్ ఆదేశించారు. ఫారెస్ట్, పంచాయతీ, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో శుక్రవారం హరితహారం కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫారెస్ట్, పంచాయతీ శాఖలు నేషనల్ హైవే అథారిటీ అధికారులు సమన్వయంతో ఉపాధి హామీలో భాగంగా రోడ్లకు ఇరువైపులా ఐదు వరుసల్లో మొక్కలు నాటాలన్నారు. ఇప్పటికే ఉన్న మొక్కల మధ్య గ్యాప్ ఉంటే ఈ నెల 14లోగా సర్వే పూర్తిచేసి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మియావాకీ తరహాలో ఐదు వరుసల్లో ప్లాంటేషన్ కోసం ఫారెస్టు అధికారులు స్థలాలను గుర్తించాలన్నారు. ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లతో కూడిన బృందాలు ఉపాధిహామీ పథకం కింద ఎస్టిమేషన్ సిద్ధం చేసి, వచ్చే సోమవారం సాయంత్రంలోగా అనుమతులు పొందాలని అన్నారు. గుంతల తవ్వకం పనులను ఈ నెల 18లోగా పూర్తి చేసుకోవాలని, 20 నుంచి మొక్కలు నాటేందుకు పూర్తిస్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో సునంద, డీఎల్పీవోలు, ఏపీడీలు, ఎంపీవోలు పాల్గొన్నారు.
నీటి సంరక్షణ పనులు చేపట్టాలి..
ఉపాధి హామీలో భాగంగా గ్రామాల్లో నీటి సంరక్షణ పనులు చేపట్టాలని కలెక్టర్ శరత్ ఆదేశించారు. కలెక్టరేట్లోని జనహిత భవనంలో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మండల స్థాయి అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. కందకాలు, ఫాంపాండ్స్, ఊట చెరువులు, చెక్డ్యాముల నిర్మాణం వంటి పనులు చేపట్టాలని సూచించారు. వీటి ద్వారా భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని తెలిపారు. చెరువులు, కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలన్నారు. మొక్కలు నాటడానికి స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. నర్సరీలను పంచాయతీ కార్యదర్శులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీఆర్డీవో వెంకట మాధవరావు, డీపీవో సునంద, జడ్పీ సీఈవో సాయాగౌడ్, ఏపీడీ సాయన్న, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.