కామారెడ్డి టౌన్, మే 10: కామారెడ్డి జిల్లాలోని ప్రతి మండలంలో కొవిడ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి, కరోనా లక్షణాలు ఉన్న వారితో ఫోన్లో మాట్లాడాలని కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని జనహిత భవన్ నుంచి జిల్లాలోని వివిధ మండలాల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆరోగ్య సర్వేను పకడ్బందీగా చేపట్టాలని, సర్వేపై నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి కిట్లు అందజేశారా..? బాధితులు మందులు సక్రమంగా వాడుతున్నారా..? అఫీషియల్, కమ్యూనిటీ వాచ్ నిర్వహిస్తున్నారా అనే వివరాలను ఆరా తీశారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి హోమ్ ఐసొలేషన్లో ఉండే విధంగా చూడాలన్నారు. ఇంట్లో వసతి లేని వారిని ప్రభుత్వ ఐసొలేషన్కు తరలించాలని సూచించారు. ఇతర దేశాలు, రాష్ర్టాల నుంచి వచ్చిన వ్యక్తులు హోమ్ క్వారంటైన్లో ఉండేలా చూడాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. వీసీలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్దోత్రే, డీఆర్డీవో వెంకటమాధవరావు, డీఎంహెచ్వో చంద్రశేఖర్, కామారెడ్డి ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ అజయ్కుమార్, డీపీవో సాయన్న, జడ్పీ సీఈవో సాయాగౌడ్, ఆర్డీవో శీను తదితరులు పాల్గొన్నారు.