కనిష్ఠంగా 10 డిగ్రీలకు టెంపరేచర్
గజగజ వణుకుతున్న జనం
ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
బారెడు పొద్దెక్కినా పోని పొగమంచు
ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత తీవ్రం
చలిమంటలతో ఉపశమనం
ఇబ్బంది పడుతున్న చిన్నారులు, వృద్ధులు
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) :ఎప్పుడూ లేనంతగా ఈసారి చలి తెగ వణికిస్తోంది. సాధారణంగా సంక్రాంతి సమయానికి ఎక్కువయ్యే చలి.. ఈసారి మాత్రం ఉత్తరాది నుంచి వీచే గాలుల ప్రభావంతో అప్పుడే చంపేస్తోంది. దీంతో మూడు, నాలుగు రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయి(10 డిగ్రీలు)కి పడిపోతున్నాయి. అందుకే బారెడు పొద్దెక్కినా జనం గడప దాటేందుకు జంకుతుండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు విపరీతంగా కమ్మేస్తుండగా, చలి నుంచి ఉపశమనం కోసం మంటకాగుతున్నారు. మరికొద్ది రోజులు తీవ్రత ఇలాగే ఉండనుండడంతో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతుండడంతో వణుకు ఎక్కువైంది. ఉదయం, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉండడంతో పాటు వేకువజామున దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. జనం అసలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. మొన్నటివరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28 నుంచి 31డిగ్రీలు.. 18నుంచి 22 డిగ్రీలుగా ఉన్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రెండు రోజుల నుంచి 12.. ఒక్కోచోట 11 డిగ్రీలకు పడిపోయాయి. వీటికి తోడు చలిగాలులు వీస్తుండడంతో సాయంత్రం ఐదు గంటల నుంచే గజగజ మొదలవుతోంది. ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పాల వ్యాపారులు , కూరగాయలు విక్రయించే వారు, పేపర్బాయ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేగాక గాలిలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో ఉబ్బసం బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. పిల్లలు, వృద్ధులకు గాలి సరిపోక అవస్థలు పడుతున్నారు. చాలామందికి జలుబు వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. చలి నుంచి ఉపశమనం కోసం ఎక్కువ మంది స్వెటర్లు, మఫ్లర్లు కొనుగోలు చేస్తున్నారు. ‘చలికాలం మొదలైనప్పటి నుంచి ఈ సీజన్లో స్వెటర్లకు ఇప్పటి వరకు గిరాకీ లేదు. రెండు మూడు రోజుల్లోనే అన్ని షాపుల్లో స్టాకులు సగానికి పైగా అమ్ముడుపోయాయ’ని నేపాల్ అమ్మకందారు దినేశ్శర్మ చెప్పారు. ఇక ఏజెన్సీ గ్రామాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. చుట్టూ పచ్చని అడవులు ఉండడంతో గిరిజన గ్రామాల్లోని ప్రజలు చలికి తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఎక్కడచూసినా చలి మంటలు కాస్తూ, స్వెటర్లతో తిరుగుతూ కనిపిస్తున్నారు. వచ్చే మూడు రోజులు సగటున రెండు నుంచి మూడు డిగ్రీలకు దాకా తగ్గుతాయని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
పొద్దుపోయాకే పనిలోకి..
చలి కారణంగా ప్రజల రోజువారీ పనులపై ప్రభావం పడుతోంది. తెల్లవారుజామున ఐదు గంటల నుంచే మొదలయ్యే పాల వ్యాపారులు, హోటల్ నిర్వాహకుల దినచర్య ఆరున్నర తర్వాత షురూ అవుతోంది. రాత్రికూడా దుకాణాలు త్వరగా మూతపడుతున్నాయి. వరంగల్ మహానగరంలో గతంలో రాత్రి పది గంటల వరకు వాణిజ్య సముదాయాలు, షాపులు తెరిచి ఉండేవి. ఇప్పుడు చలి కారణంగా జనం రాకపోవడంతో తొమ్మిది గంటల వరకే బంద్ చేయాల్సి వస్తోంది. వాహనాల రాకపోకలు చాలా తగ్గాయి.
జాగ్రత్తలు తప్పనిసరి..
రాత్రిపూట మందపు దుస్తులు వాడాలి.
సాయంత్రం 6గంటల లోపే బయట పనులు ముగించాలి.
బయటికి వెళ్లాల్సి వస్తే శరీరం పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు వేసుకోవాలి.
ద్విచక్రవాహనాలపై ప్రయాణించే వారు స్వెట్టర్, జర్కిన్లతో పాటు చేతులకు గ్లౌజ్లు, కాళ్లకు బూట్లు వేసుకొని వెళ్లాలి.
భోజనం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే త్వరగా
జీర్ణం కాక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తీసుకోవద్దు. జామ, దానిమ్మ, బొప్పాయి, సంత్ర, అరటి పండ్లు ఎక్కువగా తినాలి.
ముందుగా నూనె రాసుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. అప్పుడు చర్మాన్ని పొడిబారకుండా కాపాడుకోవచ్చు.
చర్మ సంరక్షణ కోసం మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
అప్రమత్తంగా ఉండాలి..
చలి ఎక్కువగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కరోనా రోగులు అప్రమత్తంగా ఉండాలి. జాగింగ్కు వెళ్లేవారు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.