Kollapur | మహబూబ్నగర్, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఒక మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తున్నది. కొల్లాపూర్ మండలంలోని పెద్దవాగు కేంద్రంగా సాగుతున్న ఇసుక దందాకు సదరు మంత్రి అనుచరుల అండదండలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. పెద్దవాగు నుంచి అక్రమంగా వేల టన్నుల ఇసుకను తోడి సమీప ప్రాంతంలోని మామిడి, సపోటా తోటల్లోని డంప్ల్లో దాచిపెడుతున్నట్టు సమాచారం.
అక్కడి నుంచి రాత్రిపూట హైదరాబాద్కు అక్రమంగా తరలించి రూ.కోట్లు సంపాదిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇసుకదందాను నిలువరించేందుకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ప్రయత్నించకపోవడం, అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తే తమపైనే అక్రమ కేసులు బనాయిస్తారని స్థానికులు భయపడుతున్నారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టి, డంపులను సీజు చేయకపోతే ఆందోళన చేస్తామని స్థానిక బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ముక్కిడిగుండం, మొలచింతలపల్లి, అంజనగిరి, నార్లాపూర్, యన్మన్బెట్ల, రామాపురం, చౌటబెట్ల గ్రామ శివారులోని పెద్దవాగు పరీవాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుకను వాగు నుంచి తరలించి డంపులు ఏర్పాటుచేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మామిడి, సపోటా తోటలతోపాటు వాగు పరీవాహక ప్రాంతాల్లో.. ఇలా ఎక్కడ చూసినా కనుచూపు మేర ఇసుక మేటలే దర్శనమిస్తున్నాయి.
ప్రతి ఊరిలో వేల టన్నుల ఇసుకను డంప్ చేశారు. కొన్ని రోజులుగా హిటాచీలు, జేసీబీల సహాయంతో వాగులో ఇసుకను తీసి నిల్వ చేస్తున్నారు. కొల్లాపూర్ కాంగ్రెస్ నేతల అండదండలతోనే ఇసుక దందాకు తెరలేపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాగుతీర గ్రామాల్లో నిలువ చేసిన ఇసుక రూ.కోట్ల విలువ చేస్తుందని స్థానికులు చెప్తున్నారు.
రాత్రిపూట ఇసుక డంపులను టిప్పర్ల సహాయంతో నాగర్కర్నూల్ మీదుగా హైదరాబాద్కు తరలిస్తున్నట్టు సమాచారం. ఇక్కడ ఫ్రీగా దొరికే ఇసుకను రాష్ట్ర రాజధానిలో బిల్డర్లకు అక్రమంగా రవాణా చేసి మంత్రి అనుచరులు కోట్లు గడిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక దందాను ఆపేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ప్రయత్నించకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
వంతెన నిర్మాణం పేరుతో..
నార్లాపూర్-ముక్కిడిగుండం గ్రామాల మధ్య 9 కోట్ల వ్యయంతో 185 మీటర్ల వంతెన నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణం కోసం ఒక హిటాచీ అందుబాటులో ఉంటుంది. పేరుకు దీన్ని ఇక్కడ నిలిపినా.. రాత్రి కాగానే పెద్దవాగులోకి పంపించి ఇసుకను పెద్ద మొత్తంలో తోడుతున్నారు. ట్రాక్టర్ల ద్వారా అవస రం ఉన్న చోట డంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ నేతల కనుసన్నల్లోనే జరుగుతుంది.
సీజ్ చేయకపోతే ఆందోళన
కొల్లాపూర్ మండలంలో పెద్దవాగులు చెరబట్టి మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు వేల టన్నుల ఇసుకను మామిడి తోటల మాటున డంపుచేసి కోట్ల రూపాయల దందా కు తెరలేపారని కొల్లాపూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాంచందర్ ఆరోపించారు. ముక్కిడిగుండం గ్రామంలో మామిడి తోట ల్లో ఇప్పటికీ 3,000 ట్రాక్టర్లకుపైగా ఇసుకను డంప్ చేశారని, ఇందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్తున్నారు. కొల్లాపూర్ మండలంలో అనేక గ్రామాల్లో ఉన్న ఇసుక డంపులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.