ఆత్మకూరు, జూలై 15: పైలేరియా నివారణకు డీఈసీ, అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని డీఎంహెచ్వో చల్లా మధుసూదన్ సూచించారు. జాతీయ పైలేరియా నిర్మూలన దినోత్సవంలో భాగంగా గురువారం ఆయన మండలకేంద్రంలోని పీహెచ్సీలో ఉచిత మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ పర్వతగిరి రాజుతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. డీఈసీ మాత్ర సూక్ష్మ పైలేరియాను నశింపజేస్తుందన్నారు. అల్బెండజోల్ గోళీ పేగుల్లో ఉండే క్రిములను నిర్మూలించి అదనపు లాభం చేకూరుస్తుందని వివరించారు. ఈ రెండు మాత్రలను కలిపి ఇవ్వడం ద్వారా కడుపులో పెరిగిన క్రిములపై ప్రభావం చూపుతాయన్నారు. సంక్రమిత వ్యక్తిలో రోగాభివృద్ధిని నిరోధించేందుకు పరాన్న జీవులను నశింపజేస్తుందన్నారు. ఈ మాత్రలు వాడితేనే సూక్ష్మ పైలేరియా నిర్మూలనతోపాటు దోమల ద్వారా సీజనల్ వ్యాధులు రాకుండా నిరోధించగలుగుతామని వెల్లడించారు. పైలేరియా ప్రభావిత మండలాలైన ఆత్మకూరు, సంగెంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వయస్సుల వారీగా మాత్రలు మింగిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి కే క్రాంతికుమార్, స్థానిక వైద్యాధికారి కే రణధీర్, సబ్ యూనిట్ అధికారి మాడిశెట్టి శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ పాలకుర్తి సదానందం, సిబ్బంది నర్సమ్మ, ఉమ, పార్మాసిస్టు ధర్మరాజు, మాజీ ఎంపీటీసీ పరికిరాల వాసు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మార్క రజినీకర్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
పైలేరియా నివారణే సర్కారు ధ్యేయం
సంగెం: పైలేరియా నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నదని ఎంపీపీ కందకట్ల కళావతి అన్నారు. మండలకేంద్రంలోని పీహెచ్సీ వైద్యాధికారి పొగాకుల అశోక్ ఆధ్వర్యంలో పైలేరియా నివారణ మాత్రలను ఎంపీపీ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ అశోక్ మాట్లాడుతూ రెండేళ్ల నుంచి ఐదేళ్లలోపు వారికి డీఈసీ ఒక మాత్ర, అల్బెండజోల్ ఒక మాత్ర, 6 నుంచి 14 ఏళ్ల వారికి డీఈసీ రెండు మాత్రలు, 15 ఏళ్లు పైబడిన వారికి డీఈసీ మూడు మాత్రలు, అల్బెండజోల్ ఒక మాత్ర తీసుకోవాలని వివరించారు. రెండేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రలు వేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కే క్రాంతికుమార్, సత్యరాజ్, నరహరి, శాంతమ్మ, రంజిత్, శ్రీనివాస్, ఏఎన్ఎంలు సునీత, సుజాత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.