వరంగల్, జూలై 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి : పేదల సొంతింటి కలను సాకారం చేసే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు గ్రేటర్ వరంగల్లో వేగంగా పూర్తవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ మహానగరానికి 4517 డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం పూర్తయింది. అర్హులైన పేదలకు వీటిని కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమం, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో ఇండ్ల పనులు వేగంగా కొనసాగుతుండగా మొదటి విడుత పంపిణీకి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రెండో విడత కేటాయించే ఇండ్ల పనుల్లో వేగం పెంచారు. మొత్తం రూ.94.19 కోట్లతో 4517 డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులు చేపట్టగా దాదాపు ఇవన్నీ గ్రేటర్ వరంగల్ పరిధిలోనే ఉన్నాయి. వీటిలో 800 ఇండ్ల నిర్మా ణం పూర్తయ్యింది. 2,632 ఇండ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. టెండర్ ప్రక్రియ పూర్తయిన మరో 1085 ని ర్మాణాలు త్వరలోనే మొద లు కానున్నాయి. అన్నీ అనుకూలిస్తే రెండు నెలల్లోపే లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పశ్చిమ నియోజకవర్గంలో..
వరంగల్ పశ్చిమ నియోజవర్గ పరిధిలో 1505 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అంబేద్కర్ నగర్లో 6.33 ఎకరాల్లో 16 బ్లాకులుగా 592 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. పేదలకు కేటాయించేందుకు ఇవి సిద్ధంగా ఉన్నాయి. లష్కర్ సింగారంలో 1.10 ఎకరాల్లో 208 ఇండ్లు మంజూరు కాగా వీటి నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. న్యూశాయంపేటలో 7.52 ఎకరాల్లో 19 బ్లాకులుగా మరో 608 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం వేగంగా సాగుతున్నది. కాజీపేటలో 1.20 ఎకరాల్లో 97 ఇండ్లు కట్టాల్సి ఉన్నది.
తూర్పు నియోజకవర్గంలో..
వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ప్రభుత్వం 2200 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేసింది. వీటిలో 1704 గృహాల పనులు వేగంగా సాగుతున్నాయి. దూపకుంటలో 3.22 ఎకరాల్లో 25 బ్లాకులుగా 400 ఇండ్లు కడుతున్నారు. ఇక్కడ పనులు తుది దశకు చేరాయి. మరో రెండు నెల్లో గృహప్రవేశాలకు సిద్ధం కానున్నాయి. మరో వెయ్యి ఇండ్లను 8.04 ఎకరాల స్థలంలో 63 బ్లాక్లుగా నిర్మిస్తున్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలో..
గ్రేటర్ పరిధిలోకి వచ్చే వర్ధన్నపేట నియోజవర్గంలో 792 ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఎస్ఆర్నగర్లో 6.70 ఎకరాల్లో 208 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. పైడిపల్లిలో 38 గుంటల విస్తీర్ణంలో 70 ఇండ్ల పనులు మొదలయ్యాయి. తిమ్మాపూర్లోని 3.24 ఎకరాల విస్తీర్ణంలో 320 ఇండ పనులు వేగంగా జరుగుతున్నాయి. అమ్మవారిపేటలో రెండెకరాల్లో 194 ఇండ్ల నిర్మాణానికి అధికారులు టెండర్లు పిలిచారు. దశల వారీగా ఇవన్నీ వేగంగా పూర్తయి లబ్ధిదారులకు అందనున్నాయి.